కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో ముగిసిన సీఎం చంద్రబాబు సమావేశం

  • దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
  • విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుపై ప్రధానంగా చర్చ
  • నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న ఈ సదస్సుకు నిర్మలకు ఆహ్వానం
  • రాష్ట్రంలో అంత్యోదయ పథకాల అమలు గురించి కూడా వివరణ
  • సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా... నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించ తలపెట్టిన ప్రతిష్ఠాత్మక పెట్టుబడుల సదస్సుపై చర్చించారు. ఈ సమావేశంలో చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 'రైజింగ్ ఏపీ' (RISING AP) థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సు వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కుదిరిన ఒప్పందాల గురించి తెలిపారు. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని నిర్మలా సీతారామన్‌ను ఆయన ఆహ్వానించారు.

పెట్టుబడుల సదస్సుతో పాటు, రాష్ట్రంలో అమలవుతున్న అంత్యోదయ సంక్షేమ పథకాల గురించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అమలు చేస్తున్న కార్యక్రమాల తీరును, వాటికి కేంద్రం నుంచి అందాల్సిన సహాయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని ఆయన స్పష్టం చేశారు.




More Telugu News