పాకిస్థాన్‌పై చెలరేగిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు సెహ్వాగ్ కీలక సూచన

  • పాక్‌పై 39 బంతుల్లోనే 74 పరుగులు చేసిన అభిషేక్
  • అభిషేక్‌పై ప్రశంసలు కురిపించిన వీరేంద్ర సెహ్వాగ్
  • 70, 80 పరుగులను సెంచరీలుగా మార్చాలని సెహ్వాగ్ సూచన
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఒకప్పుడు తనకు చెప్పిన మాటలనే, ఇప్పుడు యువ సంచలనం అభిషేక్ శర్మకు గుర్తుచేశాడు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. పాకిస్థాన్‌పై అభిషేక్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ అనంతరం, అతనికి సెంచరీలు చేయడంపై ఓ విలువైన సలహా ఇచ్చారు.

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 39 బంతుల్లోనే 74 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అద్భుత ప్రదర్శనపై స్పందించిన సెహ్వాగ్, మ్యాచ్ అనంతరం అభిషేక్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా, తనను సెహ్వాగ్‌తో పోల్చడంపై అభిషేక్ వినమ్రంగా స్పందించాడు. మీ కాలంలోని పాకిస్థాన్ బౌలర్లు చాలా కఠినమైన వారని, అలాంటి బౌలింగ్‌ను కూడా మీరు ఉతికి ఆరేశారని ప్రశంసించాడు. ప్రస్తుత పాక్ బౌలింగ్‌లో అంత పస లేదని అభిప్రాయపడ్డాడు.

అభిషేక్ ప్రశంసలకు సంతోషం వ్యక్తం చేసిన సెహ్వాగ్, అతనికి ఒక ముఖ్యమైన సూచన చేశాడు. "నువ్వు 70 లేదా 80 పరుగుల వద్దకు చేరుకున్నప్పుడు, సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. ఇదే మాట నాకు సునీల్ గవాస్కర్ చెప్పారు. రిటైర్ అయ్యాక, ఇలా చేజారిన ఇన్నింగ్స్‌లు గుర్తుకొచ్చి బాధపడతాం. అరె, అప్పుడు సెంచరీ చేసి ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. అందుకే, నీదైన రోజున నాటౌట్‌గా నిలిచి, భారీ స్కోరు సాధించాలి" అని సెహ్వాగ్ హితవు పలికాడు. 


More Telugu News