పాక్‌తో మాకేం పోటీ.. దాన్ని రైవల్రీ అనకండి: సూర్యకుమార్

  • పాకిస్థాన్‌తో పోటీ అనే మాటే వద్దన్న సూర్యకుమార్
  • 15 మ్యాచ్‌ల్లో 12 మేమే గెలిచామన్న భారత కెప్టెన్
  • పాకిస్థాన్‌పై భారత్ సునాయాస విజయం
  • అభిషేక్ శర్మ ప్రతిభపై సూర్య ప్రశంసలు
భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఒకప్పుడు తీవ్ర ఉత్కంఠ ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పోటీలో పస తగ్గిపోయిందని, ఇకపై దాన్ని 'రైవల్రీ' ( సమాన ప్రత్యర్థి) అని పిలవడం మానేయాలని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.

మీడియా సమావేశంలో ఒక పాకిస్థానీ సీనియర్ జర్నలిస్టు, రెండు జట్ల మధ్య ప్రమాణాల్లో అంతరం పెరిగిపోయిందా? అని ప్రశ్నించారు. దీనికి సూర్యకుమార్ నవ్వుతూ బదులిచ్చాడు. "సార్, నాదొక విన్నపం. ఇకపై భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లను రైవల్రీ అని పిలవడం ఆపేద్దాం" అని అన్నాడు. అయితే, సదరు జర్నలిస్టు తాను ప్రమాణాల గురించి అడుగుతున్నానని స్పష్టం చేయగా, "రైవల్రీ అయినా, ప్రమాణాలైనా అన్నీ ఒకటే. రెండు జట్లు 15 మ్యాచ్‌లు ఆడితే 8-7 స్కోరు ఉంటే దాన్ని పోటీ అంటారు. ఇక్కడ 12-3 లేదా 13-1 ఉంది. ఇందులో పోటీ ఎక్కడుంది?" అని సూర్యకుమార్ స్పష్టం చేశాడు.

ఈ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లోనూ పాకిస్థాన్ కంటే మెరుగ్గా ఆడిందని సూర్యకుమార్ తెలిపాడు. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ కేవలం 9.5 ఓవర్లలోనే 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గెలుపునకు బలమైన పునాది వేశారని కొనియాడాడు. యువ ఆటగాడు అభిషేక్ శర్మ తన బాధ్యతలను చక్కగా అర్థం చేసుకుంటున్నాడని, ప్రతి గేమ్‌తోనూ మెరుగవుతున్నాడని ప్రశంసించాడు.

మరోవైపు, పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా తమ ఓటమిని అంగీకరించాడు. తాము 15-20 పరుగులు తక్కువ చేశామని, ఈ టోర్నీలో ఇంకా ఒక్క సరైన గేమ్ కూడా ఆడలేదని వ్యాఖ్యానించాడు. భారత ఓపెనర్లను కట్టడి చేయడంలో తమ బౌలర్లు విఫలమయ్యారని అంగీకరించాడు. అన్ని విభాగాల్లోనూ రాణించి, తర్వాతి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.


More Telugu News