దీపికా పదుకొణే తాజా పోస్ట్.. 'కల్కి 2' గురించేనా?

  • 'కల్కి 2' సీక్వెల్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న దీపికా పదుకొణే
  • సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టిన నటి
  • 18 ఏళ్ల క్రితం షారుక్ చెప్పిన పాఠాన్ని గుర్తు చేసుకున్న వైనం
పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే తప్పుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించిన నేపథ్యంలో, దీపిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్ ఈ చర్చను మరింత వేడెక్కిస్తోంది. తన నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని ఆమె పరోక్షంగా వెల్లడించినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

ప్రస్తుతం షారుక్ ఖాన్‌తో కలిసి ‘కింగ్’ చిత్రంలో నటిస్తున్న దీపిక, 18 ఏళ్ల క్రితం ‘ఓం శాంతి ఓం’ సినిమా సమయంలో ఆయన తనకు నేర్పిన ఒక ముఖ్యమైన పాఠాన్ని గుర్తు చేసుకున్నారు. "మనం ఎవరితో కలిసి పనిచేస్తున్నామనే దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది" అని షారుక్ చెప్పిన మాటను ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ మాటను తాను బలంగా నమ్ముతానని, అప్పటి నుంచి తీసుకునే ప్రతీ నిర్ణయం ఆ పాఠం ప్రకారమే ఉంటుందని దీపిక తన పోస్టులో స్పష్టం చేశారు.

‘కల్కి 2’ నుంచి తప్పుకున్న సమయంలోనే ఆమె ఈ పోస్ట్ పెట్టడంతో, తన నిర్ణయాన్ని పరోక్షంగా సమర్థించుకుంటున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. తన కెరీర్ నిర్ణయాలు పూర్తిగా వ్యక్తిగత అభిరుచులు, వృత్తిపరమైన అంశాల ఆధారంగానే ఉంటాయని ఆమె చెప్పకనే చెప్పినట్లు నెటిజన్లు విశ్లేషిస్తున్నారు.

మరోవైపు, ఈ వివాదంపై చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా పరోక్షంగా స్పందించారు. "జరిగిపోయిన దాన్ని ఎవరూ మార్చలేరు, కానీ ఆ తర్వాత ఏం జరగాలో మనమే నిర్ణయించుకోవచ్చు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియాలో కొందరు అభిమానులు కల్కిలోని దీపిక లుక్‌కు ఆలియా భట్, రష్మిక, సమంత వంటి హీరోయిన్ల ముఖాలను ఏఐ (AI) టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి పోస్టులు పెడుతుండటం గమనార్హం. మొత్తం మీద, దీపికా పోస్ట్ ‘కల్కి 2’ సీక్వెల్ చుట్టూ కొత్త చర్చకు దారితీసింది. 



More Telugu News