ఎంపీల ఓట్లను రేవంత్ రెడ్డి అమ్ముకున్నారు: కౌశిక్ రెడ్డి

  • ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీల ఓట్లు బీజేపీకి అమ్మేశారని విమర్శ
  • 15 ఓట్ల తేడా.. అందులో 8 తెలంగాణ ఎంపీలవేనని ఆరోపణ
  • మోదీ, చంద్రబాబుల మెప్పు కోసమే రేవంత్ ఈ పని చేశారని ధ్వజం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లను ఆయన బీజేపీకి అమ్ముకున్నారని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ విషయంలో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారని వ్యాఖ్యానించారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తమ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 315 ఓట్లు పడ్డాయని ట్వీట్ చేశారని, కానీ వాస్తవానికి ఆయనకు 300 ఓట్లు మాత్రమే వచ్చాయని కౌశిక్ రెడ్డి గుర్తుచేశారు. గల్లంతైన ఆ 15 ఓట్లలో 8 ఓట్లు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలవేనని ఆయన ఆరోపించారు. ఈ ఎనిమిది మంది ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేసి, ఆ తర్వాత కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలను కలిశారని తెలిపారు. తనకు ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు స్వయంగా ఈ విషయం చెప్పారని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని మోదీ, చంద్రబాబులతో ఉన్న సంబంధాల కారణంగానే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహం చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. "రాహుల్ గాంధీ దేశంలో ఓట్ల చోరీ గురించి మాట్లాడుతుంటే, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రే ఓట్లను దొంగిలిస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పారని అభ్యర్థిని నిలబెట్టి, మోదీ చెప్పారని ఓట్లను అమ్ముకున్నారు" అని ఆయన విమర్శించారు. గురుదక్షిణ పేరుతో రేవంత్ రెడ్డి.. మోదీ, చంద్రబాబులకు మేలు చేస్తున్నారని, సొంత పార్టీ బలపరిచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారని అన్నారు.

కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నారని, ఆయన కాంగ్రెస్‌కు ముఖ్యమంత్రా లేక బీజేపీకి ముఖ్యమంత్రా అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులకు కూడా తెలియకుండా సీబీఐ విచారణకు ఆదేశించడం బీజేపీతో కుమ్మక్కైన దానికి నిదర్శనమని ఆరోపించారు. ఇదేవిధంగా, తెలంగాణకు రావాల్సిన రాజ్యసభ సీటును కూడా పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తికి అమ్ముకున్నారని, గ్రూప్-1 పోస్టుల భర్తీలోనూ అవకతవకలు జరిగాయని ఆయన విమర్శించారు. 


More Telugu News

Koushik Reddy Revanth Reddy Telangana BRS Congress BJP Vote Selling Parliament Elections Telangana Politics Justice Sudarshan Reddy