అసలే మూడో కాన్పు... నలుగురికి జన్మనిచ్చిన మహిళ!

  • సతారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతంగా శస్త్ర చికిత్స 
  • నలుగురు శిశువులు బరువు తక్కువగా ఉండటంతో ఎన్ఐసీయూలో ఉంచిన వైద్యులు
  • మొత్తంగా ఏడుగురు పిల్లలకు తల్లయిన మహిళ
మహారాష్ట్రలోని సతారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన వైద్య విజయం నమోదైంది. పూణె జిల్లా సస్వాద్‌కు చెందిన ఒక మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చారు. ఇది ఆమెకు మూడో కాన్పు కావడం విశేషం. ఇదివరకే ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆమె, తాజాగా నలుగురికి జన్మనివ్వడంతో ఆమె సంతానం సంఖ్య ఏడుకు చేరింది.

వైద్యుల సమాచారం ప్రకారం ఈ నలుగురిలో ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు. వీరి బరువు 1200 గ్రాముల నుంచి 1600 గ్రాముల మధ్య ఉంది. తక్కువ బరువు కారణంగా శిశువులను వెంటనే ఎన్‌ఐసీయూలో ఉంచారు. వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని నిపుణులు తెలిపారు.

పూణె జిల్లా సస్వాద్‌కు చెందిన ఈ మహిళ ఉద్యోగరీత్యా కోరెగావ్‌లో ఉంటున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా రెండు రోజుల క్రితం ఆమె సతారా జిల్లా ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక పరీక్షల అనంతరం సిజేరియన్ చేయాల్సిన అవసరం ఉందని గుర్తించిన వైద్యులు, వెంటనే శస్త్రచికిత్స చేపట్టారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, తల్లి త్వరగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.

ఈ మహిళకు ఇదివరకే మొదటి కాన్పులో కవలలు - ఒక అబ్బాయి, ఒక అమ్మాయి జన్మించగా, రెండో కాన్పులో ఒక ఆడపిల్ల జన్మించింది. తాజా మూడో కాన్పులో ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి కలగడంతో ఆమె మొత్తం ఏడు మంది పిల్లల తల్లిగా నిలిచారు.

సతారా జిల్లా ఆసుపత్రిలో ఒకే కాన్పులో ఒక మహిళ నలుగురు బిడ్డలకు జన్మనివ్వడం ఇదే మొదటిసారి అని వైద్యులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు గతంలో నమోదయ్యాయి కానీ, సతారా జిల్లాలో ఇదే మొదటిసారి అని వైద్య సిబ్బంది వివరించారు. 

Woman gives birth to quadruplets
Satara
Maharashtra
quadruplets
hospital delivery
rare birth
seven children
Pune district
Saswad
NICU

More Telugu News