ఆంధ్రా జట్టుకు విదేశీ కోచ్... రాష్ట్ర క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి

Gary Stead appointed Andhra cricket team head coach
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. రాష్ట్ర క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఒక విదేశీ క్రికెటర్‌ను ప్రధాన కోచ్‌గా నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 2025-26 రంజీ సీజన్‌కు గాను ఆంధ్రా పురుషుల క్రికెట్ జట్టుకు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ కోచ్ గ్యారీ స్టీడ్‌ను హెడ్ కోచ్‌గా నియమించినట్లు ఏసీఏ శనివారం అధికారికంగా ప్రకటించింది.

ఈ నియామకంపై ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ, రాష్ట్రంలోని యువ క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించి వారి నైపుణ్యాలను మెరుగుపరచడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. "ఆంధ్రా ఆటగాళ్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే ఆశయంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. న్యూజిలాండ్ జట్టు కోచ్‌గా గ్యారీ స్టీడ్ పదవీకాలం ముగియడంతో ఆయన్ను సంప్రదించాం. అన్ని ఫార్మాట్లలో ఆయనకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆయన నాయకత్వంలో మన ఆటగాళ్లలో పోటీతత్వం మరింత పెరుగుతుందని విశ్వసిస్తున్నాం" అని శివనాథ్ వివరించారు.

ఈ నియామకం ఆంధ్రా క్రికెట్ ప్రగతిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు పేర్కొన్నారు. గ్యారీ స్టీడ్ అనుభవం, వ్యూహాలు జట్టుకు ఎంతో మేలు చేస్తాయని, ఆయన మార్గనిర్దేశనంలో ఆంధ్రా జట్టు రంజీ ట్రోఫీ వంటి ప్రధాన టోర్నీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

స్టీడ్ వంటి మేటి కోచ్ రాకతో రాష్ట్రంలోని యువ ప్రతిభావంతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Go Back to Shorts
Gary Stead
Andhra cricket
New Zealand
coach
ACA
Kesineni Srinivas
Ranji Trophy
Indian cricket
foreign coach
cricket association

More Telugu News