అమరావతి క్వాంటం వ్యాలీ అభివృద్ధికి కమిటీలు

  • అపెక్స్, ఎక్స్‌పర్ట్ కమిటీలను ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
  • అపెక్స్ కమిటీ చైర్మన్‌గా ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కమకోటి నియామకం
  • ఐఐటీ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్. సత్యనారాయణ చైర్మన్‌గా ఎక్స్‌పర్ట్ కమిటీ 
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ కార్యదర్శి భాస్కర్ కాటమనేని
క్వాంటం వ్యాలీని అమరావతిలో నెలకొల్పి, రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయి క్వాంటం టెక్నాలజీస్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో, అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (AQCC) అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు కమిటీలను (అపెక్స్, ఎక్స్‌పర్ట్) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అపెక్స్ కమిటీకి ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి చైర్మన్‌గా, ఎక్స్‌పర్ట్ కమిటీకి ఐఐటీ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్. సత్యనారాయణ చైర్మన్‌గా నియమితులయ్యారు. అపెక్స్ కమిటీలో 14 మంది, ఎక్స్‌పర్ట్ కమిటీలో 13 మంది సభ్యులుగా ఉన్నారు. వీరిలో ఐఐటీలు, ఐఐఎస్సీ, ఇస్రో, సీఎస్ఐఆర్, సీడీఏసీ, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్, ఏడబ్ల్యూఎస్, ఎన్వీఐడీఐఏ వంటి దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన నిపుణులు ఉన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రెండు కమిటీలు పనిచేస్తాయి. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ద్వారా చేపట్టే కార్యక్రమాలకు ఈ కమిటీలు మార్గదర్శనం చేయడంతో పాటు సాంకేతిక పర్యవేక్షణను కూడా అందిస్తాయి. ఈ మేరకు కమిటీల యొక్క పాత్ర, బాధ్యతలను తెలియజేస్తూ ప్రభుత్వ కార్యదర్శి భాస్కర్ కాటమనేని ఉత్తర్వులు జారీ చేశారు. 


More Telugu News