Chandragrahanam: చంద్రగ్రహణం ఎఫెక్ట్... ఏపీ, తెలంగాణలో ప్రధాన దేవాలయాలు మూసివేత

Chandragrahanam Effect Temples in AP Telangana Closed
షార్ట్స్‌లో చూడండి
ఆదివారం ఏర్పడిన చంద్రగ్రహణం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన దేవాలయాల తలుపులు మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర ప్రముఖ పుణ్యక్షేత్రాలలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను మూసివేశారు. గ్రహణానంతరం సోమవారం తెల్లవారుజామున ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తి చేసి తిరిగి దర్శనాలకు అనుమతించనున్నారు.

ఈ చంద్రగ్రహణం ఆదివారం రాత్రి 9:50 గంటలకు ప్రారంభమై, సోమవారం తెల్లవారుజామున 1:31 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకే సంప్రదాయబద్ధంగా మూసివేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి, ఉదయం 6 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు తెలిపారు. ఆలయం మూసివేసే సమయానికి కంపార్ట్‌మెంట్లలో ఉన్న భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం కల్పించినట్లు అదనపు ఈవో వెంకయ్య చౌదరి వివరించారు.

గ్రహణం కారణంగా తిరుమలలోని అన్నప్రసాద కేంద్రాలను మూసివేయడంతో, భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సుమారు 50,000 పులిహోర ప్యాకెట్లను సిద్ధం చేసి భక్తులకు పంపిణీ చేశారు. అలాగే ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి పలు ఆర్జిత సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది.

తిరుమలతో పాటు శ్రీశైల మల్లికార్జున స్వామి, భద్రాచలం సీతారామచంద్ర స్వామి, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి, సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి, విజయవాడ కనకదుర్గ, ఒంటిమిట్ట కోదండరామ ఆలయం, అరసవల్లి సూర్యనారాయణ స్వామి, బాసర సరస్వతి, వేములవాడ రాజరాజేశ్వరి ఆలయాలను కూడా మూసివేశారు. గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ చేసి ఆలయాలను పునఃప్రారంభించనున్నట్లు ఆయా దేవాలయాల అధికారులు వెల్లడించారు.
Go Back to Shorts
Chandragrahanam
Lunar Eclipse
Temples Closed
Tirumala
Srisailam
Bhadrachalam
Yadadri
Simhachalam
Andhra Pradesh
Telangana

More Telugu News