కరాచీలో వినాయక నిమజ్జనం... ఆసక్తిగా చూసిన స్థానిక పాకిస్థానీలు
- ఆటోలో విగ్రహాన్ని ఉంచి నిమజ్జనానికి ఊరేగింపు
- 'గణపతి బప్పా మోరియా' నినాదాలతో హిందువుల నృత్యాలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్.. కోట్లలో వ్యూస్
వివరాల్లోకి వెళితే, కరాచీ నగరంలోని హిందూ సమాజం గణేశ్ నవరాత్రులను భక్తిశ్రద్ధలతో జరుపుకుంది. ఉత్సవాల అనంతరం ఓ పెద్ద వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఆటోలో ఉంచి శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పాల్గొన్న భక్తులు డోలు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగిపోయారు. రోడ్డుపై వెళుతున్న స్థానిక పాకిస్థానీలు ఈ ఊరేగింపును ఎంతో ఆసక్తిగా, ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు.
ఈ అరుదైన దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్గా మారింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ వీడియోకు కోట్లలో వ్యూస్, 14 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "అన్ని మతాలను గౌరవించడమే అసలైన మానవత్వం" అని ఒకరు వ్యాఖ్యానించగా, "పాకిస్థాన్లో ఇలాంటి వేడుక నిర్వహించాలంటే చాలా ధైర్యం కావాలి" అని మరొకరు కామెంట్ చేశారు. పాకిస్థాన్లో వినాయక విగ్రహం ఎలా దొరికిందంటూ మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారింది.