Ponguleti Srinivasa Reddy: కమీషన్ల దురాశతోనే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ చేపట్టారు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే భారీగా కమీషన్లు వస్తాయన్న దురాలోచనతోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రాజెక్టును చేపట్టారని, అదే పేదలకు ఇళ్లు కట్టిస్తే కమీషన్లు రావన్న కారణంతో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం వారి పదేళ్ల పాలనలో భారీ అవినీతికి పాల్పడిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈరోజు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లిలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ. 8.19 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. ఆ అప్పులకు తమ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతినెలా వడ్డీలు కడుతూనే, మరోవైపు సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళుతోందని స్పష్టం చేశారు.

పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, పేదలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని పొంగులేటి ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 7 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు, పాత కార్డులలో 17 లక్షల మంది పేర్లను చేర్చామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ సర్కారు ఏటా రెండు వేల ఇళ్లు కట్టినా పదేళ్లలో అర్హులందరికీ ఇళ్లు అందేవని, కానీ వారికి ఆ చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

రాబోయే రోజుల్లో మూడు విడతలుగా రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
Ponguleti Srinivasa Reddy
Kaleshwaram Project
KCR
Telangana
Double Bedroom Houses
Indiramma Houses
BRS Government
New Ration Cards
Corruption
Telangana Politics

More Telugu News