మరోసారి రికార్డులు బద్దలుకొట్టిన బాలాపూర్ లడ్డూ

  • రూ. 35 లక్షలకు లడ్డూను లడ్డూను దక్కించుకున్న దశరథ్ గౌడ్
  • గతేడాది రూ. 30.01 లక్షల రికార్డు బ్రేక్
  • వేలం పాటలో హోరాహోరీగా పాల్గొన్న 38 మంది భ‌క్తులు
  • 1994లో రూ. 450తో మొదలైన వేలం ప్రస్థానం
ప్రతి ఏటా ఎంతో ఆసక్తి రేకెత్తించే బాలాపూర్ గణపతి లడ్డూ వేలం ఈసారి కూడా కొత్త రికార్డు నెలకొల్పింది. తన పాత రికార్డును తానే బద్దలు కొడుతూ ఈ ఏడాది ఏకంగా రూ. 35 లక్షల భారీ ధర పలికింది. వినాయక చవితి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ లడ్డూ వేలం పాట ఉత్కంఠభరితంగా సాగింది.

హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ ఈ ప్రతిష్ఠాత్మకమైన లడ్డూను దక్కించుకున్నారు. ఈ ఏడాది జరిగిన వేలం పాటలో మొత్తం 38 మంది పోటీ పడ్డారు. హోరాహోరీగా సాగిన ఈ వేలంలో చివరికి దీనిని దశరథ్ గౌడ్ ద‌క్కించుకున్నారు.

గతేడాది ఈ లడ్డూ రూ. 30.01 లక్షలకు అమ్ముడుపోగా, ఆ రికార్డును ఈ సంవత్సరం సునాయాసంగా అధిగమించింది. గతేడాది కొలను శంకర్ రెడ్డి లడ్డూను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

కాగా, బాలాపూర్ లడ్డూ వేలం సంప్రదాయం 1994లో ప్రారంభమైంది. అప్పట్లో కేవలం రూ. 450తో మొదలైన ఈ వేలం ప్రస్థానం, దశాబ్దాలు గడిచేసరికి లక్షల్లోకి చేరి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ లడ్డూను దక్కించుకుంటే శుభం కలుగుతుందని, వ్యాపారంలో వృద్ధి ఉంటుందని భక్తులు బలంగా విశ్వసిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం పోటీ తీవ్రంగా ఉంటుంది.


More Telugu News