పాకిస్థాన్‌కు మద్దతిచ్చినందుకు భారత్ మమ్మల్ని అడ్డుకుంటోంది: అజర్‌బైజాన్

  • భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన అజర్‌బైజాన్
  • ఎస్సీఓలో పూర్తి సభ్యత్వాన్ని భారత్ అడ్డుకుంటోందని ఆరోపణ
  • పాకిస్థాన్‌తో స్నేహం వల్లే భారత్ ప్రతీకార చర్యలు
  • భారత్‌పై పాక్ విజయం సాధించిందన్న అజర్‌బైజాన్ అధ్యక్షుడు
  • 'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్థాన్‌కు బాకు మద్దతు
భారతదేశం తమపై ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని అజర్‌బైజాన్ సంచలన ఆరోపణలు చేసింది. పాకిస్థాన్‌తో తమకున్న సన్నిహిత సంబంధాల కారణంగానే అంతర్జాతీయ వేదికలపై భారత్ తమను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించింది. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ)లో తమ పూర్తిస్థాయి సభ్యత్వాన్ని భారత్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని అజర్‌బైజాన్ మీడియా పేర్కొంది.

ఇటీవల చైనాలోని టియాంజిన్‌లో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది సైనిక ఘర్షణలో భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించిందని, ఇందుకు ఇస్లామాబాద్‌కు అభినందనలు అని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికలపై న్యూఢిల్లీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, పాకిస్థాన్‌తో తమ సోదరభావానికే తొలి ప్రాధాన్యత ఇస్తామని అలియేవ్ స్పష్టం చేసినట్టు టర్కీకి చెందిన 'డైలీ సబా' పత్రిక వెల్లడించింది.

ఎస్సీఓలో అజర్‌బైజాన్ సభ్యత్వ దరఖాస్తును భారత్ మరోసారి నిరోధించిందని 'ఏన్యూజెడ్' అనే స్థానిక టీవీ ఛానల్ ఆరోపించింది. బహుపాక్షిక దౌత్య సూత్రాలను భారత్ ఉల్లంఘిస్తోందని విమర్శించింది. పాకిస్థాన్‌తో తమకు రాజకీయ, సాంస్కృతిక, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయని, ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సహకారాన్ని మరింత విస్తరిస్తామని అలియేవ్ తెలిపారు.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అజర్‌బైజాన్ బహిరంగంగా పాకిస్థాన్‌కు మద్దతు ప్రకటించింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అప్పట్లో ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌తో రక్షణ, వాణిజ్యం, ప్రాంతీయ భద్రత వంటి రంగాల్లో అజర్‌బైజాన్ సహకారాన్ని గణనీయంగా పెంచుకుంది.



More Telugu News