మంత్రి నారా లోకేశ్ కు మరో అరుదైన గౌరవం
- ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆహ్వానం
- స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని పిలుపు
- ఆహ్వాన లేఖను పంపిన ఆస్ట్రేలియన్ హైకమిషన్
మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రశంసించింది. ఈ మేరకు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేశ్ ను కోరింది. గత 20 ఏళ్లలో భారత్ కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమం ద్వారా ఆస్ట్రేలియాలో పర్యటించారని పేర్కొంది. 2001లో ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఇందులో పాల్గొన్నారని వెల్లడించింది.
స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావడం ద్వారా ఆస్ట్రేలియాలోని కీలక రాజకీయ నేతలు, విద్యారంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులతో సమావేశమయ్యే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఏపీ అభివృద్ధి ప్రాధాన్యతలు.. ముఖ్యంగా విద్యారంగం, నైపుణ్యాలు, పెట్టుబడులు, ఆక్వాకల్చర్, మౌలిక వసతులపై ఆస్ట్రేలియాతో చర్చించేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుంది.