విశాఖలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్.. వెల్లువెత్తిన వినతులు
- విశాఖలో మంత్రి లోకేశ్ 68వ రోజు ప్రజాదర్బార్
- ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు
- ప్రతి ఒక్కరి సమస్యను ఓపిగ్గా విన్న మంత్రి
- అన్ని వినతులపై త్వరితగతిన చర్యలు తీసుకుంటానని హామీ
- మత్స్యకారుల నుంచి దివ్యాంగుల వరకు పలువురి విజ్ఞప్తులు
కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ మంత్రి లోకేశ్ ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను ఓపికగా విన్నారు. వారు సమర్పించిన వినతిపత్రాలను స్వీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం ప్రజలు, కార్యకర్తలతో కలిసి ఫోటోలు దిగారు.
ఈ సందర్భంగా పలు సంఘాల ప్రతినిధులు మంత్రిని కలిసి తమ సామూహిక సమస్యలను విన్నవించుకున్నారు. ఉత్తరాంధ్ర వాడబలిజ మత్స్యకార సంక్షేమ సంఘం ప్రతినిధులు తమకు బోట్లు, వలలు అందించి ఆదుకోవాలని, తమ ప్రాంతాల్లో పాఠశాలలు, శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా, వినాయక చవితి ఉత్సవాల ఊరేగింపులో సౌండ్ సిస్టమ్స్ వినియోగానికి గతేడాది మాదిరిగానే అనుమతులు ఇవ్వాలని ఉత్తరాంధ్ర ఈవెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. దీనిపై వేలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని వారు మంత్రికి వివరించారు.
ప్రజాదర్బార్లో పలు వ్యక్తిగత సమస్యలు, కన్నీటి గాథలు కూడా మంత్రి దృష్టికి వచ్చాయి. రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన దాడి అవినాశ్ అనే యువకుడు, రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయి తీవ్రంగా గాయపడిన గుడాల జీవన్ కుమార్ కుటుంబం తమను ఆదుకోవాలని మంత్రిని వేడుకున్నారు. దివ్యాంగురాలైన తన కుమార్తెకు ఉద్యోగం కల్పించాలని ఓ తండ్రి కోరగా, ఇంటి నిర్మాణానికి అడ్డుగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తొలగించాలని మరొకరు విజ్ఞప్తి చేశారు. అందిన ప్రతి విజ్ఞప్తిని పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.
