Mohammed Siraj: గ్రౌండ్‌లో వాళ్లు శత్రువులే.. కోహ్లీ నుంచి అదే నేర్చుకున్నా: సిరాజ్

Virat Kohli Taught Me To Treat Opponents As Enemies says Mohammed Siraj
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తన దూకుడైన ఆటతీరు వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించాడు. మైదానంలో తన దూకుడుకు, పోరాట పటిమకు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీయే స్ఫూర్తి అని స్పష్టం చేశాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ లేకపోయినా, అతని దూకుడును సిరాజ్ తన ప్రవర్తనలో చూపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఆటకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

"విరాట్ కోహ్లీ నుంచి నేను ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను. అదే అతని పోరాట పటిమ. మైదానం బయట అందరితో ఎంతో స్నేహంగా ఉంటాడు. కానీ, మైదానంలోకి అడుగుపెడితే మాత్రం ప్రత్యర్థి జట్టు అతనికి శత్రువుతో సమానం. అతనిలో నాకు ఈ లక్షణం బాగా నచ్చుతుంది. నా బౌలింగ్‌కు దూకుడే ప్రాణం. అది చూపించకపోతే నేను సరిగ్గా బౌలింగ్ చేయలేను" అని సిరాజ్ వివరించాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టులో చాలాకాలంగా కోహ్లీతో కలిసి ఆడటం వల్ల తమ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని సిరాజ్ తెలిపాడు. "ఫాస్ట్ బౌలర్లకు మైదానంలో దూకుడు చాలా అవసరం. కానీ, బౌలర్ల కన్నా విరాట్ కోహ్లీనే ఎక్కువ దూకుడుగా ఉంటాడు" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కేవలం దూకుడు మాత్రమే కాదని, ప్రేక్షకుల మద్దతును ఎలా ఉపయోగించుకోవాలో కూడా కోహ్లీని చూసే నేర్చుకున్నానని సిరాజ్ పేర్కొన్నాడు. "ఇంగ్లండ్‌తో జరిగిన ఓవల్ టెస్టులో రూట్, బ్రూక్ భాగస్వామ్యం నెలకొల్పినప్పుడు మా ఆటగాళ్లలో కాస్త నిరుత్సాహం కనిపించింది. ఆ సమయంలో నేను అందరినీ ఉత్తేజపరిచాను. రూట్ వికెట్ పడగొట్టి మేం పైచేయి సాధించాం. ప్రేక్షకులిచ్చే మద్దతు బౌలర్లలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఈ విషయాన్ని కూడా నేను విరాట్ నుంచే నేర్చుకున్నాను" అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Mohammed Siraj
Virat Kohli
India Cricket
Team India
RCB
Royal Challengers Bangalore
England tour
Aggression
Fast bowling
Oval Test

More Telugu News