హిందూ, క్రైస్తవ బాలికలపై పాకిస్థాన్లో అకృత్యాలు... నివేదికలో షాకింగ్ నిజాలు!
- పాకిస్థాన్లో మైనారిటీ చిన్నారులపై దారుణ వివక్ష
- ఎన్సీఆర్సీ నివేదికలో వెల్లడైన షాకింగ్ నిజాలు
- హిందూ, క్రైస్తవ బాలికలే లక్ష్యంగా కిడ్నాప్లు, బలవంతపు పెళ్లిళ్లు
- పాఠశాలల్లోనూ వివక్ష, ప్రతికూల పాఠ్యాంశాలు
- ప్రతి ఏటా వెయ్యి మంది బాలికల అపహరణ, మతమార్పిడి
‘సిచ్యుయేషన్ అనాలిసిస్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ మైనారిటీ రిలీజియన్స్ ఇన్ పాకిస్థాన్’ పేరుతో విడుదలైన ఈ అధ్యయనం ప్రకారం మైనారిటీ పిల్లలు నిత్యం వివక్ష, వేధింపులకు గురవుతున్నారు. ముఖ్యంగా బలవంతపు మతమార్పిడులు, బాల్య వివాహాలు, కిడ్నాప్లు, బాల కార్మిక వ్యవస్థ వంటి తీవ్రమైన సమస్యలను వారు ఎదుర్కొంటున్నట్లు స్పష్టం చేసింది. ఈ వివక్ష వారి దైనందిన జీవితంలోని ప్రతి అంశంపైనా తీవ్ర ప్రభావం చూపుతోందని నివేదిక పేర్కొంది.
పాఠశాలల్లో సైతం తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి మైనారిటీ పిల్లలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారు. వారి మతాలపై ప్రతికూల భావనలు కలిగించేలా పాఠ్యాంశాలు ఉండటం వల్ల ఒంటరితనం, చదువులో వెనుకబాటు వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చాలా సందర్భాల్లో ఇది వారిని పాఠశాల మానేసేలా చేస్తోందని నివేదిక వివరించింది. మైనారిటీ బాలికలపై అపహరణలు, లైంగిక దాడులు సర్వసాధారణంగా మారాయని నివేదిక తెలిపింది.
'మూవ్మెంట్ ఫర్ సాలిడారిటీ అండ్ పీస్' సంస్థ అంచనా ప్రకారం, పాకిస్థాన్లో ప్రతి సంవత్సరం దాదాపు 1,000 మంది హిందూ, క్రైస్తవ బాలికలు, యువతులు ముస్లిం పురుషుల చేతిలో కిడ్నాప్కు గురవుతున్నారు. అయితే, సామాజిక నిందలు, ప్రతీకార దాడుల భయంతో అనేక కుటుంబాలు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడంతో వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని భావిస్తున్నారు.
ఏడేళ్ల చిన్నారి నుంచి దివ్యాంగుల వరకు పేద కుటుంబాలకు చెందిన బాలికలను కిడ్నాప్ చేసి, అత్యాచారాలకు పాల్పడి, కిడ్నాపర్లతోనే బలవంతంగా పెళ్లిళ్లు జరిపిస్తున్నారని నివేదిక వెల్లడించింది. అనంతరం వారిని ఇస్లాంలోకి మార్చడం, బానిసలుగా లేదా వ్యభిచార కూపంలోకి నెట్టివేయడం వంటి ఘోరాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ అకృత్యాలను అరికట్టేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని నివేదిక డిమాండ్ చేసింది.