శ్రేయస్‌ను కాదని గిల్‌కే వన్డే కెప్టెన్సీ?.. మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • భారత వన్డే జట్టు కెప్టెన్సీపై ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు
  • శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు ఇస్తారన్న వార్తలను కొట్టిపారేసిన మాజీ క్రికెటర్
  • రోహిత్ తర్వాత శుభ్‌మన్ గిల్‌కే వన్డే కెప్టెన్సీ ఖాయమని జోస్యం
  • టెస్ట్ కెప్టెన్, టీ20 వైస్ కెప్టెన్‌గా నియామకమే దీనికి నిదర్శనమన్న చోప్రా
  • శ్రేయస్, గిల్ ఇద్దరూ అద్భుతమైన కెప్టెన్లేనని ప్రశంస
భారత వన్డే జట్టు తదుపరి కెప్టెన్సీ శ్రేయస్ అయ్యర్‌కు దక్కుతుందంటూ వస్తున్న ఊహాగానాలకు టీమిండియా మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తెరదించాడు. ఆ వార్తల్లో నిజం లేదని, రోహిత్ శర్మ తర్వాత ఆ బాధ్యతలను శుభ్‌మన్ గిల్ చేపట్టడం దాదాపు ఖాయమైపోయిందని ఆయన స్పష్టం చేశాడు. ఈ విషయంపై ఇప్పటికే ఓ నిర్ణయం జరిగిపోయిందని, అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని అభిప్రాయపడ్డాడు.

తన యూట్యూబ్ ఛానల్‌లో అభిమానులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. "టీమిండియా తదుపరి వన్డే కెప్టెన్ ఎవరనేది మంచి ప్రశ్న. శ్రేయస్ అయ్యర్ పేరు బలంగా వినిపిస్తోంది. కానీ, నా అభిప్రాయం ప్రకారం, తర్వాతి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అని ఇప్పటికే నిర్ణయమైపోయింది. అతడిని టెస్ట్ కెప్టెన్‌గా, ఆసియా కప్‌కు టీ20 వైస్ కెప్టెన్‌గా నియమించడమే దీనికి నిదర్శనం" అని చోప్రా వివరించాడు.

ఇప్పటికే గిల్ వన్డేల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్నాడని, కాబట్టి ఈ విషయంలో మరో ఆలోచనకు తావులేదని ఆయన పేర్కొన్నాడు. "గిల్ ఇప్పటికే టెస్ట్ కెప్టెన్. టీ20లకు వైస్ కెప్టెన్. అతను వన్డే వైస్ కెప్టెన్ కూడా. కాబట్టి మరో ప్రశ్న అడగకండి. తర్వాతి కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌నే" అని చోప్రా తేల్చి చెప్పాడు.

అదే సమయంలో, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ సామర్థ్యాలను పోలుస్తూ ఇద్దరూ అద్భుతమైన నాయకులేనని చోప్రా ప్రశంసించాడు. "శ్రేయస్ అద్భుతంగా రాణించాడు. కేకేఆర్‌కు టైటిల్ అందించాడు. కానీ గిల్ రికార్డు కూడా తక్కువేం కాదు. గుజరాత్‌ను ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్‌ను డ్రా చేశాడు. ముందుండి నడిపించే నాయకుడు అతను. తన ప్రదర్శనతోనే జట్టుకు ఆదర్శంగా నిలుస్తాడు" అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.


More Telugu News