పార్లమెంటులో వీఐపీల భద్రతకు సవాల్ గా మారిన 'నెంబర్.1 చెట్టు'

  • కొత్త పార్లమెంట్ వద్ద భద్రతకు అడ్డంకిగా మారిన ఓ చెట్టు
  • వీవీఐపీలు వెళ్లే మార్గంలో ఉండటంతో సమస్యగా గుర్తింపు
  • 'నంబర్ 1 చెట్టు'గా సిబ్బంది పిలుచుకునే ఈ వృక్షం
  • చెట్టును తరలించాలని నిర్ణయించిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)
  • వచ్చే వారం ప్రేరణ స్థల్‌కు మార్చేందుకు ఏర్పాట్లు
దేశ పరిపాలనకు కేంద్రమైన పార్లమెంట్‌లో భద్రత అత్యంత కఠినంగా ఉంటుంది. అలాంటి చోట ఓ చెట్టు భద్రతాధికారులకు తలనొప్పిగా మారింది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ భద్రతకే ముప్పుగా పరిణమించిందన్న ఆందోళనలతో దాన్ని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కొత్త పార్లమెంట్‌ భవనంలోని గజ ద్వారం వద్ద పసుపు పూలతో ఉండే ఓ చెట్టు ఉంది. దీన్ని సిబ్బంది ‘నెంబర్ 1 చెట్టు’గా పిలుస్తుంటారు. అయితే, ఈ చెట్టు బాగా పెరిగిపోవడంతో వీవీఐపీల రాకపోకలను పర్యవేక్షించడానికి ఇబ్బందిగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఇదే గేటు నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) దీన్ని తీవ్రమైన భద్రతా లోపంగా గుర్తించింది.

వెంటనే అప్రమత్తమైన ఎస్పీజీ, ఈ చెట్టును వేరే ప్రాంతానికి తరలించాలని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడబ్ల్యూడీ)కి సూచించింది. ఇందుకు దిల్లీ అటవీ శాఖ అనుమతి తప్పనిసరి కావడంతో, సీపీడబ్ల్యూడీ అధికారులు రూ.57 వేలు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించారు. వచ్చే వారంలో ఈ చెట్టును పార్లమెంట్ ప్రాంగణంలోనే ఉన్న ‘ప్రేరణ స్థల్’కు మార్చే ప్రక్రియను చేపట్టనున్నారు. దీనికి బదులుగా పార్లమెంట్ ఆవరణలో 10 కొత్త మొక్కలను నాటనున్నట్లు సీపీడబ్ల్యూడీ తెలిపింది.




More Telugu News