Stock Market: స్టాక్ మార్కెట్: ఆరు రోజుల వరుస లాభాలకు నేడు బ్రేక్

Stock Market Breaks Six Day Winning Streak
షార్ట్స్‌లో చూడండి
ఆరు రోజుల పాటు లాభాల్లో పరుగులు పెట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లకు శుక్రవారం బ్రేక్ పడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ ప్రసంగానికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించడంతో సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి వెల్లువెత్తింది. దీంతో గత మూడు రోజులుగా ఆర్జించిన లాభాలను మార్కెట్లు ఒక్కరోజే కోల్పోయాయి.

ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 693.86 పాయింట్లు నష్టపోయి 81,306.85 వద్ద స్థిరపడింది. ఉదయం 81,951.48 వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్, రోజంతా అమ్మకాల ఒత్తిడితో 81,291.77 వద్ద ఇంట్రా-డే కనిష్ఠాన్ని తాకింది. మరోవైపు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 213.65 పాయింట్లు దిగజారి 24,870.10 వద్ద ముగిసింది.

దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్ 1.09 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.96 శాతం, ఎఫ్‌ఎంసీజీ 1 శాతం, ఐటీ 0.79 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ లో ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రధాన షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా బలహీనపడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో రూపాయి విలువ 25 పైసలు క్షీణించి 87.50 వద్ద ముగిసింది.

రష్యాకు వ్యతిరేకంగా భారత్‌పై అమెరికా వాణిజ్య సుంకాలను వ్యూహాత్మకంగా ప్రయోగిస్తుండడం వంటి ఆందోళనలు కూడా సంస్థాగత ఇన్వెస్టర్లను ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది. ముడిచమురు ధరలు, ప్రపంచ పరిణామాలు కూడా సమీప భవిష్యత్తులో మార్కెట్లను నిర్దేశించే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty
Indian Stock Market
Share Market
Rupee Value
FII
Federal Reserve
Asian Paints
HDFC Bank

More Telugu News