భారత్‌లో ఉన్న ప్రియుడి కోసం సాహసం చేసిన శ్రీలంక అమ్మాయి!

  • తమిళనాడులోని దిండుక్కల్ జిల్లా పళని శరణార్థి శిబిరంలో యువకుడి ప్రేమలో పడిన శ్రీలంక యువతి
  • ఇటీవలే శ్రీలంక తిరిగివెళ్లిపోయిన విదుర్షియ 
  • ప్రియుడిని కలిసేందుకు ప్లాస్టిక్ పడవలో అక్రమంగా భారత్‌కు చేరిన వైనం
  • ధనుష్కోటి సమీపంలోని అరిచల్ మునై బీచ్ వద్ద విదుర్షియను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • మండపం శరణార్థి శిబిరానికి తరలింపు 
ప్రేమ కోసం దేశ సరిహద్దులు దాటి వచ్చిన ఓ యువతి వైనం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శ్రీలంకకు చెందిన 25 ఏళ్ల యువతి తన ప్రియుడిని కలిసేందుకు నకిలీ పడవలో, పరిమిత సౌకర్యాలతో భారత్‌కు రహస్యంగా చేరిన ఘటన ఇటీవల రామేశ్వరం సమీపంలోని ధనుష్కోటిలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. మన్నార్‌కు చెందిన విదుర్షియ అనే యువతి గతంలో తన తల్లిదండ్రులతో కలిసి తమిళనాడులోని దిండుక్కల్ జిల్లా పళనిలో ఉన్న శరణార్థి శిబిరంలో ఉండేది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ యువకుడితో ఆమె ప్రేమలో పడింది. అయితే, ఇటీవల ఆమె శ్రీలంకకు తిరిగి వెళ్ళిన తర్వాత, తిరిగి భారత్‌కు రావడానికి వీసా లభించకపోవడంతో ఆమె మరో మార్గాన్ని ఎంచుకుంది.

తన ప్రేమను నిజం చేసుకోవాలని సంకల్పించిన విదుర్షియ తన వద్ద ఉన్న నగలను అమ్మి, వచ్చిన డబ్బుతో శ్రీలంకలోని తలైమన్నార్ బీచ్ నుంచి ఓ ప్లాస్టిక్ పడవలో ప్రయాణించాలని నిర్ణయించుకుంది. ఆ పడవలో సముద్రం ద్వారా ప్రయాణించి, ధనుష్కోటి సమీపంలోని అరిచల్ మునై బీచ్ వద్ద భారత్‌లోకి ప్రవేశించింది.

ఈ విషయాన్ని గమనించిన కోస్టల్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగాల అధికారులు ఆమెను విచారించారు. అనంతరం అధికారులు ఆమెను మండపం శరణార్థి శిబిరానికి తరలించారు. 


More Telugu News