Lal Jan Basha: లాల్ జాన్ బాషా సేవలు చిరస్మరణీయం: నివాళి అర్పించిన పల్లా శ్రీనివాసరావు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు లాల్ జాన్ బాషాకు పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఆయన వర్థంతి సందర్భంగా శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లాల్ జాన్ బాషా చిత్రపటానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఇతర ముఖ్య నేతలు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, పార్టీకి లాల్ జాన్ బాషా అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, సీనియర్ నాయకుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ముఖ్యంగా ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం నిరంతరం తపించారని, గుంటూరు ఎంపీగా ప్రజలకు విశేష సేవలందించారని గుర్తు చేసుకున్నారు. 2013లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించడం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

అనంతరం మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు మాట్లాడుతూ, లాల్ జాన్ బాషా ఒక గొప్ప రాజకీయ యోధుడని అభివర్ణించారు. మైనారిటీ వర్గం నుంచి వచ్చి ఎన్జీ రంగా వంటి బలమైన నాయకుడిని ఓడించి తన సత్తా చాటారని గుర్తుచేశారు. 1983లో పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన నిస్వార్థంగా పనిచేశారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీ వర్గాల్లో గుర్తింపు పొందిన అతి కొద్దిమంది నాయకులలో బాషా ఒకరని అన్నారు. ఆయన స్ఫూర్తితో తామంతా ముందుకు సాగుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏవీ రమణ, పరుచూరి కృష్ణ, నాదెండ్ల బ్రహ్మం, గొట్టెముక్కుల రఘురామకృష్ణరాజు, పాతర్ల రమేశ్, సత్యవాణి, వల్లూరు కిరణ్, పులిచిన్న తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Lal Jan Basha
Palla Srinivasa Rao
Telugu Desam Party
TDP
Andhra Pradesh Politics
Muslim Minorities
Guntur MP
Paruchuri Ashok Babu
Political Leader
Road Accident

More Telugu News