ఆస్ట్రేలియాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం... నినాదాలు చేసిన ఖలిస్థాన్ మద్దతుదారులు

  • మెల్‌బోర్న్‌లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉద్రిక్తత
  • భారత కాన్సులేట్ వద్ద ఖలిస్థానీ మద్దతుదారుల ఆందోళన
  • భారతీయులకు వ్యతిరేకంగా నినాదాలు, జెండాల ప్రదర్శన
  • రంగంలోకి దిగిన పోలీసులు, పరిస్థితిని అదుపులోకి తెచ్చిన వైనం
  • భారత్‌కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆసీస్ ప్రధాని
భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వేడుకలను అడ్డుకునేందుకు ఖలిస్థానీ మద్దతుదారులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు సకాలంలో జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

వివరాల్లోకి వెళితే, నేడు మెల్‌బోర్న్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయం వద్ద ప్రవాస భారతీయులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. దేశభక్తి గీతాలు పాడుతూ ఆనందంగా వేడుకలు జరుపుకుంటున్న సమయంలో, ఖలిస్థానీ మద్దతుదారులు అక్కడికి చేరుకున్నారు. వారు తమ జెండాలను ప్రదర్శిస్తూ, భారత్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో వేడుకలకు హాజరైన భారతీయులు, ఖలిస్థానీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగి వాతావరణం వేడెక్కింది. వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

మరోవైపు, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ భారత ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌తో ఆస్ట్రేలియాకు ఉన్న స్నేహబంధాన్ని గుర్తుచేసుకుంటూ, భారత్ సాధిస్తున్న విజయాలు తమకు కూడా ఆనందాన్ని కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.


More Telugu News