ఏపీ మెగా డీఎస్సీ తుది ఫలితాలు విడుదల

  • మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం రిక్రూట్‌మెంట్‌
  • అధికారిక వెబ్‌సైట్‌లో అభ్య‌ర్థుల‌కు అందుబాటులో ఫ‌లితాలు 
  • ఈ మేర‌కు మెగా డీఎస్సీ కన్వీనర్‌ ఎం.వి. కృష్ణారెడ్డి వెల్ల‌డి
ఏపీ మెగా డీఎస్సీ తుది ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహించారు. ఫ‌లితాల‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అభ్య‌ర్థుల‌కు అందుబాటులో ఉంచిన‌ట్లు మెగా డీఎస్సీ కన్వీనర్‌ ఎం.వి. కృష్ణారెడ్డి వెల్ల‌డించారు. అభ్యర్థులు తమ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in/లో చూడవచ్చు.

అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత సవరించిన తుది కీ ఆధారంగా నార్మలైజేషన్ ప్రక్రియతో ఈ ఫలితాలను సిద్ధం చేశారు. ఫలితాలతో పాటు స్కోర్‌కార్డులు కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్‌లోకి వెళ్లి తుది ఫలితాలతో పాటు స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

ఫలితాలు తెలుసుకోండి ఇలా..
అభ్యర్థులు ముందుగా https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత హోంపేజీలో కనిపించే మెగా డీఎస్సీ-2025 ఫలితాలు విడుదల అనే లింక్‌పై క్లిక్‌ చేయాలి. అప్పుడు క్యాండిడేట్‌ లాగిన్‌కు సంబంధించిన పాప్‌అప్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో యూజర్ నేమ్ పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి సైన్‌ ఇన్‌ అవ్వాలి. అక్కడ స్కోర్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అందులో అభ్యర్థులు రాసిన మొత్తం పేపర్లు, సాధించిన మార్కులు, టెట్‌ మార్కులను పేర్కొంటూ క్వాలిఫైడ్‌/నాన్‌ క్వాలిఫైడ్‌ అనే వివరాలు ఉంటాయి.

కాగా, ఈ రిక్రూట్‌మెంట్‌కు మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. జూన్ 6 నుంచి జులై 2 వరకు 23 రోజుల పాటు పరీక్షలు రెండు సెషన్లలో జ‌రిగాయి. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హాజరు శాతం 92.90గా నమోదైంది.

ఇక‌, టెట్ వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే, అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి సరిచేసుకునే అవకాశం కల్పించారు. ఇది ఆగస్టు 13, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.


More Telugu News