మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలోని హెలిప్యాడ్ లో దిగిన తెలంగాణ మంత్రులు

  • వివాహ కార్యక్రమం కోసం మంగళగిరి వచ్చిన తెలంగాణ మంత్రులు
  • జనసేన పార్టీ కార్యాలయం హెలిప్యాడ్‌లో దిగిన హెలికాప్టర్
  • ఉప ముఖ్యమంత్రి భట్టి బృందానికి పవన్ కల్యాణ్ తరఫున స్వాగతం
  • స్వాగతం పలికిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ హరిప్రసాద్
  • తిరుగు ప్రయాణంలో మంత్రులకు కొండపల్లి బొమ్మలు బహూకరించిన జనసేన నేతలు
  • భట్టితో పాటు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి తదితరుల హాజరు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి అద్దం పట్టే ఆసక్తికర పరిణామం ఆదివారం మంగళగిరిలో చోటుచేసుకుంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో మంగళగిరి వచ్చారు. వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నేరుగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో ల్యాండ్ అయింది.

ఆదివారం ఉదయం జరిగిన ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి ఉన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరఫున శాసనమండలిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పి. హరిప్రసాద్, ఇతర జనసేన నాయకులు తెలంగాణ మంత్రులకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వారంతా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు.

కార్యక్రమం ముగిసిన తర్వాత తెలంగాణ మంత్రులు తిరుగు ప్రయాణమయ్యేందుకు తిరిగి జనసేన కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వారితో కలిశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా పంపిన, తెలుగు సంస్కృతికి ప్రతీకలైన కొండపల్లి బొమ్మల జ్ఞాపికలను తెలంగాణ మంత్రులకు బహూకరించి జనసేన నాయకులు వీడ్కోలు పలికారు. 



More Telugu News