ఇంటి నుంచి పారిపోయిన అక్క.. చెల్లిని పెళ్లిచేసుకుని తిరిగొచ్చింది!

  • ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో ఘటన
  • ఇంటి నుంచి అదృశ్యమై సోదరిని పెళ్లాడిన యువతి
  • తాము ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నట్టు చెప్పిన వైనం
  • ఇంట్లో చెబితే ఒప్పుకోరనే పెళ్లి చేసుకున్నట్టు చెప్పిన యువతి
  • పోలీసులు చెప్పినా నిర్ణయాన్ని మార్చుకోని యువతులు
ఉత్తరప్రదేశ్‌లో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. తప్పిపోయిన యువతిని వెతుకుతున్న కుటుంబానికి ఊహించని షాక్ ఎదురైంది. ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ యువతి తన సోదరి వరసైన మరో అమ్మాయిని వివాహం చేసుకుంది. ఇకపై తాము భార్యాభర్తలుగా కలిసి జీవిస్తామని చెప్పడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు విస్మయానికి గురయ్యారు.

ముజఫర్‌నగర్‌కు చెందిన ఒక యువతి ఇటీవల ఇంటి నుంచి అదృశ్యమైంది. తన కుమార్తె కిడ్నాప్‌కు గురై ఉంటుందని అనుమానించిన ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు యువతి ఆచూకీ గుర్తించారు. భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఇటీవల ఆమె పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. 

అయితే, ఆమె ఒంటరిగా కాకుండా, వరుసకు చెల్లి అయ్యే మరో అమ్మాయితో కలిసి పెళ్లి దుస్తుల్లో పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. తాము వివాహం చేసుకున్నామని, ఇకపై భార్యాభర్తలుగా కలిసి జీవిస్తామని చెప్పడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. తానే వరుడిగా మారి తన చెల్లిని వివాహం చేసుకున్నట్టు ఆ యువతి పోలీసులకు వివరించింది.

తాము గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నామని, తమ ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో పారిపోయి వివాహం చేసుకున్నామని ఆ ఇద్దరు యువతులు పోలీసులకు తెలిపారు. వారు తిరిగి ఇళ్లకు వెళ్లేలా అధికారులు నచ్చజెప్పడానికి ప్రయత్నించినప్పటికీ వారు తమ నిర్ణయాన్ని మార్చుకోవడానికి నిరాకరించారు. 


More Telugu News