ప్రజలారా! మోసపోకండి: 'బాలయ్య-బసవతారకం ఈవెంట్'పై నందమూరి బాలకృష్ణ స్పందన

  • బసవతారకం ఆసుపత్రి పేరిట మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మవద్దని సూచన
  • అనధికారిక, తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
  • 'బంగారు బాలయ్య -బసవతారకం ఈవెంట్'తో తనకు సంబంధం లేదని స్పష్టీకరణ
బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి పేరుతో జరుగుతున్న మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మవద్దని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. అనధికారికంగా, తప్పుదారి పట్టించే విధంగా ఉన్న కార్యక్రమాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

బసవతారకం ఆసుపత్రి తరఫున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు, విరాళాల అభ్యర్థనలు ధ్రువీకరించబడిన, పారదర్శక మాధ్యమాల ద్వారా మాత్రమే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

"ప్రజలకు హెచ్చరిక. 'బంగారు బాలయ్య - బసవతారకం ఈవెంట్' పేరుతో అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి నా పేరును, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి పేరును అనుమతి లేకుండా ఉపయోగిస్తూ విరాళాల సేకరణ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి నా అనుమతి లేదు. ఆసుపత్రి ట్రస్ట్ బోర్డు తరఫున కూడా ఎటువంటి అధికారిక ఆమోదం లేదు" అని బాలకృష్ణ పేర్కొన్నారు.


More Telugu News