ఇన్ స్టా మోజు... పాపను బస్టాండులో వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయిన మహిళ!

  • నల్లగొండలో వెలుగుచూసిన ఘటన 
  • సీసీ కెమెరా పుటేజీ అధారంగా మహిళను గుర్తించిన పోలీసులు
  • బాలుడిని తండ్రికి అప్పగించిన పోలీసులు
నల్లగొండలో ఓ మహిళ తన కన్నబిడ్డ అయిన రెండేళ్ల బాలుడిని బస్టాండ్‌లో వదిలి, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ప్రియుడితో వెళ్లిపోయిన అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తల్లి కనిపించకుండా పోవడంతో బాలుడు గుక్కపెట్టి ఏడుస్తుండటం గమనించిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో బాలుడి తల్లికి సంబంధించిన షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్‌లో నివసించే ఆమెకు నల్లగొండకు చెందిన యువకుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ యువకుడిని కలిసేందుకు ఆమె హైదరాబాద్ నుంచి నల్లగొండకు చేరుకుంది. తన రెండేళ్ల కుమారుడిని బస్టాండ్‌లోనే వదిలి ప్రియుడి బైక్‌పై ఆమె వెళ్లిపోయింది.

సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు వారి జాడను గుర్తించారు. ఆ వ్యక్తిని, మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది. అనంతరం, ఆ మహిళ ఇచ్చిన సమాచారం మేరకు ఆమె భర్తను అక్కడికి పిలిపించి బాలుడిని అతడికి అప్పగించారు. 


More Telugu News