కర్నూలు జిల్లాలో డ్రోన్ నుంచి క్షిపణి పరీక్ష.. ట్వీట్ చేసిన రాజ్‌నాథ్ సింగ్

  • కర్నూలులోని ఎన్ఓఏఆర్‌లో ప్రతిష్ఠాత్మక పరీక్ష
  • డీఆర్డీవో, క్షిపణి అభివృద్ధి భాగస్వాములను అభినందించిన రాజ్‌నాథ్ సింగ్
  • 'ఎక్స్' వేదికగా ఫొటోను పంచుకున్న కేంద్ర మంత్రి
డ్రోన్ నుండి క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ పరీక్ష ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో గల నేషనల్ ఓపెన్ ఏరియా రేంజి (ఎన్ఓఏఆర్)లో జరిగింది. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫొటోను ఆయన 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు.

డీఆర్డీఓ, ఈ క్షిపణి అభివృద్ధి మరియు తయారీలో భాగస్వాములైన ఎంఎస్ఎంఈలు, స్టార్టప్స్‌‌లను రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. సంక్లిష్టమైన సాంకేతికతను అర్థం చేసుకోవడంతో పాటు ఉత్పత్తి చేయగల సామర్థ్యం భారతదేశానికి ఉందని ఈ పరీక్ష నిరూపించిందని ఆయన పేర్కొన్నారు.

దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని యూఏవీ లాంచ్‌డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ (యూఎల్‌పీజీఎం)-వీ3గా వ్యవహరిస్తున్నారు. అయితే, దీని సాంకేతిక వివరాలను వెల్లడించలేదు. గతంలో డీఆర్డీవో పత్రాలు, బహిరంగ సమాచారం ప్రకారం గతంలో పరీక్షించిన యూఎల్‌పీజీఎం-వీ2 వేదికపైనే దీనిని అభివృద్ధి చేశారు.

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను సమీపంలోని డీఆర్డీవోకు చెందిన ఎన్ఓఏఆర్ పరీక్ష కేంద్రాన్ని దీని కోసం ఎంచుకున్నారు. గతంలో కూడా ఇక్కడ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ వ్యవస్థను పరీక్షించేందుకు ఇదే వేదికను ఉపయోగించారు. ఈ ఆయుధం ఫిక్స్‌డ్‌వింగ్ మానవరహిత విమానాలను కూల్చివేయడానికి ఉపయోగిస్తారు.


More Telugu News