రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌కు బెయిల్... హైకోర్టుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

  • న్యాయాధికారం దుర్వినియోగమైందన్న సుప్రీంకోర్టు
  • హైకోర్టు చేసిన తప్పును తాము చేయబోమన్న సుప్రీంకోర్టు
  • అరెస్టు చేయడానికి ఆధారాలు లేవన్న హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. న్యాయాధికారాన్ని దుర్వినియోగం చేశారని వ్యాఖ్యానించింది. హైకోర్టు చేసిన తప్పును తాము పునరావృతం చేయబోమని స్పష్టం చేసింది.

దోషిగా లేదా నిర్దోషిగా ప్రకటన చేసేందుకు ఇప్పుడే ఎలాంటి తీర్పు వెలువరించబోమని ప్రధాన నిందితురాలు పవిత్ర గౌడ తరఫు న్యాయవాదికి సుప్రీంకోర్టు తెలియజేసింది.

అరెస్టు చేయడానికి తగిన ఆధారాలు లేవని హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దిగువ కోర్టు పొరపాటు చేస్తే పరిగణనలోకి తీసుకోవచ్చని, కానీ హైకోర్టు న్యాయమూర్తి అలా చేయడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.

కర్ణాటకలో దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రేణుకాస్వామిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ సహా 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రేణుకాస్వామిని దారుణంగా కొట్టినట్లు విచారణలో తేలింది. గత ఏడాది అక్టోబర్‌లో దర్శన్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు, డిసెంబర్ 13న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.


More Telugu News