లార్డ్స్ టెస్టులో దూకుడు.. మహమ్మద్ సిరాజ్‌పై ఐసీసీ చర్యలు

  • మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం
  • సిరాజ్ ఖాతాలో 1 డీ-మెరిట్ పాయింటును చేర్చిన ఐసీసీ
  • రెండేళ్లలో సిరాజ్‌కు రెండో డీ-మెరిట్ పాయింటు
భారత పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ అవుటైన తర్వాత సిరాజ్ దూకుడుగా వ్యవహరించినందుకు ఐసీసీ ఈ చర్యలు తీసుకుంది. అలాగే అతడి ఖాతాలో ఒక డీ-మెరిట్ పాయింటును కూడా చేర్చింది.

ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.5 ప్రకారం అభ్యంతరకరంగా ప్రవర్తించడం, భాషను వినియోగించడం, బ్యాటర్ ఔట్ అయి వెళుతున్నప్పుడు దురుసుగా వ్యవహరించడం నేరమని ఐసీసీ పేర్కొంది. బెన్ డకెట్ ఔటైన క్రమంలో సిరాజ్ దూకుడుగా వ్యవహరించినట్టు గుర్తించారు.

దీంతో సిరాజ్‌కు జరిమానాతో పాటు డీమెరిట్ పాయింటును విధించింది. గత రెండేళ్ల కాలంలో సిరాజ్‌కు ఇది రెండో తప్పిదం కావడంతో అతని ఖాతాలో రెండు డీ-మెరిట్ పాయింట్లు చేరాయి. రెండేళ్ల కాలంలో ఆటగాడి ఖాతాలో 4 డీ-మెరిట్ పాయింట్లు ఉంటే అవి సస్పెన్షన్ పాయింట్లుగా మారతాయి. అప్పుడు మ్యాచ్ నిషేధం ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది.


More Telugu News