Student suicide attempt: అధ్యాపకుడి వేధింపులు... పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న విద్యార్థిని

ఒడిశాలోని బాలాసోర్‌లోని ఒక కళాశాలలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడనే ఆరోపణలతో ఓ అధ్యాపకుడిపై ఫిర్యాదు చేసిన విద్యార్థిని, వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఆమె 95 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెను కాపాడబోయిన మరో విద్యార్థికి కూడా 70 శాతం కాలిన గాయాలయ్యాయి.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆ అధ్యాపకుడిని అరెస్టు చేశారు. ఉన్నత విద్యాశాఖ కళాశాల ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యబన్షి సూరజ్ హామీ ఇచ్చారు.

ఫకీర్ మోహన్ కళాశాలలో చదువుతున్న బాధిత విద్యార్థిని జులై 1న కళాశాల అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేసింది. తన విభాగాధిపతి సమీర్ కుమార్ తనను వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. వారం రోజుల్లో అతనిపై చర్యలు తీసుకుంటామని విద్యార్థినికి హామీ ఇచ్చినప్పటికీ, అది జరగలేదని తెలుస్తోంది.

అధ్యాపకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మనస్తాపం చెందిన బాధిత విద్యార్థిని, ఇతర విద్యార్థులతో కలిసి కళాశాల గేటు వెలుపల నిరసనకు దిగింది. ఆ సమయంలో విద్యార్థిని ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ ప్రిన్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లి, తనపై తాను పెట్రోలు పోసుకొని నిప్పంటించుకుంది.

మంటలు అంటుకున్న తర్వాత ఆమె కారిడార్‌లో పరుగెత్తుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఒక విద్యార్థి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా, అతని టీషర్టుకు కూడా మంటలు అంటుకున్నాయి.

ఈ ఘటనపై ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్ స్పందిస్తూ, విద్యార్థిని ఫిర్యాదు చేసిందని, అంతర్గత కమిటీ నివేదికను సమర్పించే పనిలో ఉందని చెప్పారు. బాధిత విద్యార్థిని తనను కార్యాలయంలో కలిసిందని, ఆ అధ్యాపకుడి వల్ల తాను పడిన వేదనను తెలిపిందని, ఆ వెంటనే అతడిని తన కార్యాలయానికి పిలిచి విచారించానని ఆయన పేర్కొన్నారు.
Student suicide attempt
Balasore college
Odisha
Professor harassment
Fakir Mohan College

More Telugu News