ఆ పేలుడు పదార్థాలు అమెజాన్‌లో కొన్నారట!

  • అల్యూమినియం పౌడర్‌ను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన ఉగ్రవాదులు
  • ఆయుధాల కొనుగోలుకు ఈ కామర్స్ ఫ్లాట్ ఫారమ్ సేవలు ఉపయోగిస్తున్న ఉగ్రవాద సంస్థలు
  • ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ తాజా నివేదికలో వెల్లడి
ఉగ్రవాద సంస్థలు ఆయుధాల కొనుగోలుకు ఈ-కామర్స్ ఫ్లాట్ ఫారమ్‌లు, ఆన్‌లైన్ చెల్లింపు సేవలను వినియోగిస్తున్నాయని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) తన తాజా నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. ఉగ్రవాద నిధులను పర్యవేక్షించే ఈ అంతర్జాతీయ సంస్థ ఈ మేరకు నివేదిక విడుదల చేసింది.

భారతదేశంలో జరిగిన పుల్వామా దాడి (2019), గోరఖ్‌నాథ్ ఆలయ దాడి (2022) ఘటనలను ఎఫ్‌ఏటీఎఫ్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ దాడులలో ఆన్‌లైన్ వేదికల పాత్ర కీలకమని పేర్కొంది.

పుల్వామా దాడిలో ఐఈడీ తయారీకి అవసరమైన అల్యూమినియం పౌడర్‌ను ప్రముఖ ఈ-కామర్స్ వేదిక అమెజాన్ ద్వారా ఉగ్రవాదులు ఆర్డర్ చేశారని ఎఫ్‌ఏటీఎఫ్ తన నివేదికలో తెలిపింది. గోరఖ్‌నాథ్ ఆలయ దాడికి పాల్పడిన నిందితులు పేపాల్ ద్వారా దాదాపు రూ.6.7 లక్షలు విదేశాలకు పంపారని, ఇందుకోసం వీపీఎన్ సేవలను ఉపయోగించి తమ స్థానాన్ని దాచిపెట్టారని వెల్లడించింది. ప్రస్తుతం ఉగ్రవాదులు ఈ-కామర్స్ ద్వారా 3డీ ప్రింటర్లు, రసాయనాలు, ఆయుధ విడిభాగాలను సైతం ఆర్డర్ చేస్తున్నారని ఎఫ్‌ఏటీఎఫ్ పేర్కొంది. 


More Telugu News