దుబాయ్ గోల్డెన్ వీసా ఆఫర్ పై వెల్లువెత్తుతున్న మీమ్స్

  • రూ.23 లక్షలు కడితే జీవితాంతం దుబాయ్‌లో ఉండొచ్చంటూ యూఏఈ ఆఫర్
  • తొలి దశలోనే భారత్, బంగ్లాదేశ్ పౌరులకు ఈ సౌకర్యం
  • ఈ వార్తపై సోషల్ మీడియాలో మీమ్స్‌తో నెటిజన్ల సందడి
భారత్, బంగ్లాదేశ్ పౌరులకు ప్రత్యేకంగా గోల్డెన్ వీసా సదుపాయం కల్పిస్తూ యూఏఈ చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. కేవలం రూ.23.30 లక్షలు కడితే దుబాయ్ లో జీవితాంతం ఉండొచ్చంటూ యూఏఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది. గతంలో ఈ మొత్తం రూ.4.7 కోట్లుగా ఉండేది. అయితే, ఈ వార్తపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. "హేరా ఫేరీ" సినిమాలోని అక్షయ్ కుమార్ క్లిప్ ను పెట్టి "ధనవంతులైన భారతీయులను దుబాయ్ పిలుస్తోంది" అని ఒకరు పోస్ట్ చేయగా, మరొకరు "దుబాయ్ వెళ్లడానికి నిధులు సేకరిస్తున్నా" అంటూ క్యూఆర్ కోడ్ షేర్ చేశారు.

"పంచాయత్" వెబ్ సిరీస్ మీమ్‌తో "మేం పేదవాళ్లం, అందుకే 23 లక్షలు పెట్టి దుబాయ్ వెళ్లలేం" అంటూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో యూఏఈ గోల్డెన్ వీసా పొందాలంటే అక్కడి రియల్ ఎస్టేట్‌లో 2 మిలియన్ ఏఈడీ (దాదాపు రూ. 4.7 కోట్లు) పెట్టుబడి పెట్టాల్సి ఉండేది. ఇప్పుడు ఆ నిబంధనను సడలించి శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, నర్సులు, యూట్యూబర్లు, డిజిటల్ క్రియేటర్లు వంటి వివిధ రంగాల నిపుణులకు కూడా ఈ అవకాశాన్ని విస్తరించారు. ఈ కొత్త విధానం విదేశీ పౌరులు యూఏఈలో స్థిరపడటాన్ని మరింత సులభతరం చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

యూఏఈ ఆఫర్ ఇదే..
"నామినేషన్ ఆధారిత వీసా పాలసీ" కింద యూఏఈ ప్రభుత్వం కొత్త రకం గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టింది. అర్హులైన భారతీయులు 1,00,000 ఏఈడీ (సుమారు రూ. 23.30 లక్షలు) రుసుము చెల్లించి జీవితకాల నివాస వీసాను పొందవచ్చు. కుటుంబ సభ్యులను కూడా దుబాయ్‌కు తీసుకెళ్లే సౌకర్యం ఉంది. తొలి దశలో ఈ అవకాశాన్ని భారత్, బంగ్లాదేశ్ పౌరులకు కల్పించింది.


More Telugu News