నటి తండ్రిపై క్లినిక్‌లోనే కాల్పులు.. రోగిగా నటించి దుండగుల ఘాతుకం.. వీడియో ఇదిగో!

  • పంజాబ్‌లో డాక్టర్‌పై క్లినిక్‌లో కాల్పులు
  • రోగులుగా నటించి ఇద్దరు దుండగుల దాడి
  • బాధితుడు పంజాబీ నటి తనేయా తండ్రి
  • రెండు బుల్లెట్ గాయాలు, పరిస్థితి విషమం
  • సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు
  • గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ నుంచి గతంలో బెదిరింపులు
పంజాబ్‌లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. రోగికి చికిత్స చేస్తుండగా, ఓ వైద్యుడిపై దుండగులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. మోగా జిల్లాలో జరిగిందీ ఘటన. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వైద్యుడి పరిస్థితి విషమంగా ఉంది.

మోగా జిల్లాలోని కోట్ ఇసేఖాన్ పట్టణంలోని హర్‌బన్స్ నర్సింగ్ హోమ్‌లో ఈ దాడి జరిగింది. బాధితుడు డాక్టర్ అనిల్‌జిత్ కంబోజ్‌ను ప్రముఖ పంజాబీ నటి తనేయా తండ్రిగా గుర్తించారు. రోగుల రూపంలో వచ్చిన ఇద్దరు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వారిలో ఒకరు తన కాలికి ఇన్ఫెక్షన్ ఉందని, పరీక్షించాలని కోరాడు. డాక్టర్ కంబోజ్ అతని కాలును పరిశీలించేందుకు కిందకు వంగగా, వెనుకనే ఉన్న మరో వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ దృశ్యాలన్నీ క్లినిక్‌లోని సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.

ఈ దాడిలో డాక్టర్ కంబోజ్ ఛాతీ, పొట్ట భాగంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మూడు గంటల పాటు శస్త్రచికిత్స చేసి బుల్లెట్లను తొలగించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని డాక్టర్ విజయ్ కల్రా తెలిపారు. డాక్టర్ కుమారుడు చాహత్ కంబోజ్ ఫిర్యాదు మేరకు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామన్నారు.

పోలీసుల విచారణలో మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు శుక్రవారం ఉదయం 10 గంటలకే క్లినిక్‌కు వచ్చారని, అప్పుడు డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగి మధ్యాహ్నం 12:50 గంటలకు మళ్లీ వచ్చి దాడి చేశారని పోలీసులు తెలిపారు. కాగా, 2022లో డాక్టర్ కంబోజ్‌కు గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండా నుంచి డబ్బు కోసం బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై అప్పట్లోనే మోగా పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News