Madras High Court: పెళ్లికి ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి చేయలేం: మద్రాస్ హైకోర్టు

వివాహానికి ముందు వధూవరులకు వైద్య పరీక్షలను తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురావాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం కొట్టివేసింది. చట్టాలను రూపొందించే పూర్తి అధికారం పార్లమెంటుకు ఉంటుందని, ఈ విషయంలో తాము ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

మదురైకి చెందిన రమేశ్ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇటీవల కాలంలో వివాహిత జంటల మధ్య విభేదాలు పెరిగి విడాకులు, ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోందని ఆయన తన పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం లైంగికపరమైన లోపాలు, అనారోగ్య సమస్యలేనని పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో పెళ్లికి ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి అని, మన దేశంలో కూడా అలాంటి చట్టం తీసుకువచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

నిన్న ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎస్.ఎం. సుబ్రహ్మణ్యం, జస్టిస్ శ్రీమతిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు స్పందిస్తూ ఇలాంటి సున్నితమైన విషయాలపై చట్టాలు చేయాలా వద్దా అనేది పార్లమెంటు నిర్ణయిస్తుందని తెలిపారు. చట్ట రూపకల్పన విషయంలో కోర్టు ఎలా జోక్యం చేసుకోగలదని, ప్రభుత్వానికి ఎలా ఉత్తర్వులు ఇవ్వగలదని ప్రశ్నిస్తూ పిటిషన్‌ను తిరస్కరించారు.
Madras High Court
Madras High Court
Medical tests before marriage
Plea dismissal
Public interest litigation
Divorce rate
Sexual health issues
Parliament decision
Indian law

More Telugu News