Stock Markets: వారాంతంలో లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతం ట్రేడింగ్‌ను లాభాలతో ముగించాయి. అంతర్జాతీయంగా సానుకూల పవనాలు వీస్తున్నప్పటికీ, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వెలువడుతున్న వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో రోజంతా తీవ్ర ఒడుదొడుకులకు లోనైన సూచీలు, చివరికి ఫ్లాట్‌గా ముగిసి స్వల్ప లాభాలను నమోదు చేశాయి.

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 193 పాయింట్ల లాభంతో 83,432 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 25,461 వద్ద ముగిసింది. 

రంగాల వారీగా చూస్తే, ఆటోమొబైల్, టెలికాం, లోహ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. మరోవైపు బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ, రియల్టీ, మీడియా వంటి రంగాల సూచీలు 0.4 నుంచి 1 శాతం వరకు లాభపడ్డాయి. 

నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యునిలీవర్ షేర్లు ప్రధానంగా లాభపడగా.. ట్రెంట్, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.

ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు పుంజుకుని 85.38 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకున్నాయి. 
Stock Markets
Sensex
Nifty
Indian Stock Market
Share Market
BSE
NSE
Rupee Dollar
Bajaj Finance
Infosys

More Telugu News