Pawan Kalyan: రాజమండ్రిలో 'అఖండ గోదావరి' పర్యాటక ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేసిన షెకావత్, పవన్ కల్యాణ్

రాజమండ్రిలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు నిర్మాణానికి గురువారం అంకురార్పణ జరిగింది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం గోదావరి తీర ప్రాంత అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు.

శంకుస్థాపన కార్యక్రమం అనంతరం, కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్న రూ.375 కోట్ల నిధులతో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని గజేంద్ర సింగ్ షెకావత్, పవన్ కల్యాణ్ తిలకించారు. అనంతరం, గోదావరి తీరంలోని రివర్ ఫ్రంట్ వ్యూ పాయింట్ నుంచి అఖండ గోదావరి ప్రాజెక్టును నిర్మించ తలపెట్టిన ప్రాంతాన్ని వారు పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులు వారికి వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా పర్యాటకం గణనీయంగా వృద్ధి చెందుతుందని, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. వీరితో పాటు కూటమి ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, గిడ్డి సత్యనారాయణ, మద్దిపాటి వెంకటరాజు, చిర్రి బాలరాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా హాజరయ్యారు.

అలాగే, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ, రాజమండ్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (రుడా) ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డీసీసీబీ) ఛైర్మన్ తుమ్మల రామస్వామి, జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర జిల్లా అధికారులు, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. 
Pawan Kalyan
Gajendra Singh Shekhawat
Akhanda Godavari
Rajahmundry
Tourism Project
Andhra Pradesh Tourism
Godavari River
Tourism Development
Kandula Durgesh
Daggubati Purandeswari

More Telugu News