ఖతార్‌‌లో అమెరికా స్థావరాలను టార్గెట్ చేసిన ఇరాన్

  • ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసిన అమెరికా
  • పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు 
  • దోహాలోని యూఎస్ స్థావరంపై ఆరు మిస్సైళ్లను ప్రయోగించిన ఇరాన్
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన విషయం విదితమే. ఈ పరిణామంతో అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్, సర్వశక్తులతో బదులిస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు చేపట్టింది.

ఖతార్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ టీవీ వెల్లడించింది. దోహాలోని యూఎస్ స్థావరంపై ఆరు మిస్సైళ్లను ప్రయోగించింది. ఈ దాడులను టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే ఈ దాడుల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఖతార్ తెలిపింది.

ఇరాన్ ప్రతీకార దాడులు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిచువేషన్ రూమ్‌కు వెళ్లి పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఆయన సమీక్షించారు.

ఆపరేషన్ బెషారత్ ఫతా‌లో భాగంగా శక్తివంతమైన మిస్సైళ్లను ప్రయోగించినట్లు ఇరాన్ ఆర్మీ దళాలు తెలిపాయి. మరోపక్క ఇరాన్ దాడుల నేపథ్యంలో రెండు ఎయిర్ ఇండియా విమానాలను దారి మళ్లించారు. భారత్ నుంచి కువైట్‌కు బయలుదేరిన ఆకాశ విమానం ఏకే 571 దాడుల నేపథ్యంలో ముంబయికి తిరిగి వచ్చింది. 


More Telugu News