Ram Charan: ‘పెద్ది’ కోసం చరణ్ మరో సాహసం.. ఉత్కంఠ రేపుతున్న రాత్రివేళ పోరాట దృశ్యాలు!

Peddi Ram Charan Film Night Fight Scenes Revealed
షార్ట్స్‌లో చూడండి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా, ఈ చిత్ర యూనిట్ ఓ కీలకమైన, ఉత్కంఠభరితమైన నైట్ యాక్షన్ సీక్వెన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు సమాచారం.

ఈ యాక్షన్ ఘట్టాన్ని సహజమైన లైటింగ్‌కు పేరుపొందిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తన కెమెరాలో బంధించారు. ఈ నైట్ యాక్షన్ సీక్వెన్స్‌ను ‘గ్రిట్టీ విజువల్స్‌తో కూడిన అద్భుతమైన ఘట్టం’గా చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు. నటుడిగా రామ్ చరణ్ అంకితభావాన్ని, నటనను ప్రశంసిస్తూ, ఆయన సెట్స్‌లో ‘నిప్పులు చెరుగుతున్నారని’ రత్నవేలు పేర్కొన్నారు.  

కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా కోసం భారతీయ సినిమాలో మునుపెన్నడూ చూడని విధంగా ఒక భారీ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ ట్రైన్ ఎపిసోడ్ కోసం ప్రఖ్యాత ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా అత్యంత శ్రద్ధతో సెట్‌ను రూపొందించారని, ఇది భారతీయ సినిమా యాక్షన్ ప్రమాణాలను మరో స్థాయికి తీసుకెళ్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. జూన్ 19 వరకు చిత్రీకరించిన ఈ సన్నివేశాల్లో రామ్ చరణ్ పలు సాహసోపేతమైన, ప్రమాదకరమైన స్టంట్స్ చేశారని తెలిసింది. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలకు ‘పుష్ప 2’ ఫేమ్, అలాగే క్రికెట్ షాట్‌తో పేరుగాంచిన నబకాంత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

దర్శకుడు బుచ్చిబాబు సానా సృష్టిస్తున్న ఈ భారీ ప్రపంచంలో రామ్ చరణ్ పూర్తిగా లీనమై, పాత్రకు ప్రాణం పోయడానికి తన శాయశక్తులా కృషి చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ జాతీయ స్థాయిలో విశేషమైన స్పందనను రాబట్టుకుంది. ఇది కేవలం క్రికెట్ లేదా స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదని, కథాపరంగా అనేక అంశాలతో ప్రేక్షకులకు వెండితెరపై ఓ విందు భోజనంలా ఉంటుందని తెలుస్తోంది.

వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. చిత్ర నిర్మాణ పనులు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సాగుతున్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Go Back to Shorts
Ram Charan
Peddi Movie
Buchi Babu Sana
Janhvi Kapoor
AR Rahman
Train Action Sequence
Telugu Cinema
Rathnavelu Cinematography
Sukumar Writings
Sports Drama

More Telugu News