Indus Waters Treaty: సింధు నీళ్లు పాక్ కు వెళ్లకుండా భారత్ కొత్త వ్యూహం

సింధు జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే దిశగా భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. జమ్మూకశ్మీర్‌లోని అదనపు జలాలను పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాలకు తరలించేందుకు 113 కిలోమీటర్ల పొడవైన కాలువను నిర్మించాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని ప్రారంభించింది. తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ నదుల పూర్తి వినియోగంతో పాటు, సింధు జలాల ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నదుల నుంచి భారత్‌కు కేటాయించిన వాటాను సంపూర్ణంగా వాడుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఫలితంగా పాకిస్థాన్‌కు వెళ్లే అదనపు నీటి ప్రవాహం గణనీయంగా తగ్గనుంది.

జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఉయ్జ్ బహుళార్థ సాధక ప్రాజెక్టును (జలవిద్యుత్, సాగునీరు, తాగునీరు) కూడా పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించింది. చీనాబ్ నదిని రావి-బియాస్-సట్లెజ్ నదులతో అనుసంధానించే ఈ ప్రతిపాదిత కాలువ, ఇప్పటికే ఉన్న కాలువ నిర్మాణాలను జమ్మూ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లలోని 13 ప్రాంతాలలో కలుపుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ద్వారా ఇందిరా గాంధీ కాలువకు (సట్లెజ్-బియాస్) నీటిని చేరవేయనున్నారు.

ఈ పరిణామాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, "రాబోయే మూడేళ్లలో సింధు జలాలను కాలువల ద్వారా రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు తీసుకువెళ్తాం. దీనివల్ల దేశంలోని పెద్ద విస్తీర్ణంలో సాగునీటి సౌకర్యాలు మెరుగుపడతాయి, అదే సమయంలో పాకిస్థాన్ ప్రతి నీటి బొట్టు కోసం అల్లాడుతుంది" అని అన్నారు.

ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన నేపథ్యంలో, చీనాబ్ నదిపై ఉన్న బగ్లిహార్, సలాల్ జలవిద్యుత్ ప్రాజెక్టుల జలాశయాల పూడికతీత వంటి స్వల్పకాలిక చర్యలతో పాటు ఈ దీర్ఘకాలిక ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం చేపడుతోంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పాకల్ దుల్ (1000 మెగావాట్లు), రాట్లే (850 మెగావాట్లు), కిరు (624 మెగావాట్లు), క్వార్ (540 మెగావాట్లు) వంటి జలవిద్యుత్ ప్రాజెక్టులను వేగవంతం చేయడం ద్వారా కూడా సింధు జలాలను మరింతగా వినియోగించుకోవాలని భారత్ భావిస్తోంది.
Indus Waters Treaty
India Pakistan
Amit Shah
Chenab River
Ujh Project
Indus River
Irrigation Project
Jammu Kashmir
Water Resources

More Telugu News