విమాన ప్రమాదంపై ముఖేశ్‌ అంబానీ దిగ్భ్రాంతి.. బాధితులకు అండగా ఉంటామని ప్రకటన

  • అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ తీవ్ర విచారం
  • బాధితులకు, సహాయక చర్యలకు రిలయన్స్ పూర్తి మద్దతు
  • ఈ కష్టకాలంలో అన్ని విధాలా సాయం చేస్తామన్న అంబానీ
  • ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పారిశ్రామికవేత్త
అహ్మదాబాద్‌లో నిన్న‌ జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్‌ అంబానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

"అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో సంభవించిన తీవ్ర ప్రాణ నష్టం నన్ను, నీతను, మొత్తం రిలయన్స్ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. తీవ్ర వేదనకు గురిచేసింది. ఈ విషాద ఘటనలో నష్టపోయిన వారందరికీ మా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాము" అని అంబానీ తన ప్రకటనలో పేర్కొన్నారు. 

ఈ కష్ట సమయంలో బాధితులకు అండగా నిలుస్తామని, కొనసాగుతున్న సహాయక చర్యలకు రిలయన్స్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. "ఈ దుఃఖ సమయంలో కొనసాగుతున్న సహాయక చర్యలకు రిలయన్స్ తన పూర్తి, అచంచలమైన మద్దతును అందిస్తుంది. సాధ్యమైన అన్ని విధాలుగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఊహించని నష్టాన్ని తట్టుకునే శక్తిని, ధైర్యాన్ని బాధితులందరికీ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము" అని అంబానీ తెలిపారు.

కాగా, నిన్న అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన విష‌యం తెలిసిందే. ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉండగా, వీరిలో 241 మంది మృతిచెందారు. 

అలాగే విమానం ఒక మెడికల్ కాలేజీ కాంప్లెక్స్‌పై పడ‌డంతో అక్క‌డ 24 మంది చ‌నిపోయారు. ఈ దుర్ఘటనలో ప్రయాణికులు, కింద ఉన్నవారితో కలిపి 265 మంది మరణించారు. ఈ ప్రమాదంలో అనేక మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, బీజే మెడికల్ కాలేజ్, సివిల్ హాస్పిటల్ ప్రాంగణంలో తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిసింది. 

ప్రమాద స్థలంలో సహాయక బృందాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తుండగా, అధికారులు ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. 


More Telugu News