శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మళ్లీ వాయిదా.. కారణం ఇదే!

  • భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మళ్లీ వాయిదా
  • ప్రతికూల వాతావరణమే కారణమని తెలిపిన ఇస్రో
  • జూన్ 10న జరగాల్సిన ప్రయోగం బుధవారానికి మార్పు
  • యాక్సియం-4 మిషన్‌లో పైలట్‌గా శుభాంశు శుక్లా
  • గతంలో మే 29, జూన్ 8 తేదీల్లోనూ వాయిదా పడ్డ ప్రయోగం
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఆయన మరో ముగ్గురు విదేశీ వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) ప్రయాణం కావాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణ పరిస్థితులు అడ్డంకిగా మారాయి. దీంతో ప్రయోగం వాయిదా పడినట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది.

వివరాల్లోకి వెళితే, శుభాంశు శుక్లా, మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, హంగరీకి చెందిన స్పెషలిస్ట్ టిబర్ కపు, పోలండ్‌కు చెందిన స్లావోస్జ్‌ ఉజ్నాన్స్‌కీ-విస్నియెస్కీలు ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా జూన్ 10వ తేదీ సోమవారం సాయంత్రం 5:52 గంటలకు (భారత కాలమానం ప్రకారం) నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది.

అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ ప్రయోగాన్ని బుధవారానికి వాయిదా వేసినట్లు ఇస్రో వెల్లడించింది. ఒకవేళ జూన్ 10న ప్రయోగానికి ఏవైనా ఆటంకాలు ఎదురైతే, జూన్ 11వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు మరో ప్రయోగ అవకాశాన్ని సిద్ధంగా ఉంచినట్లు స్పేస్‌ఎక్స్ సంస్థ ఇదివరకే తెలియజేసింది. ప్రస్తుత వాయిదా నేపథ్యంలో, బుధవారం ప్రయోగాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యాక్సియం-4 మిషన్‌లో శుభాంశు శుక్లా మిషన్ పైలట్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఈ యాత్ర వాస్తవానికి గత నెల మే 29వ తేదీనే జరగాల్సి ఉండగా, పలు కారణాల వల్ల తొలుత జూన్ 8వ తేదీకి, ఆ తర్వాత జూన్ 10వ తేదీకి మార్చారు. తాజాగా మరోసారి వాతావరణం కారణంగా వాయిదా పడటంతో, బుధవారానికి వాయిదా పడింది. 1984లో రష్యాకు చెందిన సోయుజ్ రాకెట్ ద్వారా రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత, సుదీర్ఘ విరామం అనంతరం మరో భారత పౌరుడు రోదసీయానం చేయనుండటం ఇదే మొదటిసారి.


More Telugu News