DK Shivakumar: గవర్నర్‌ను ఎవరు ఆహ్వానించారో తెలియదు: ఆర్సీబీ సన్మాన కార్యక్రమంపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

DK Shivakumar on RCB Event Governor Invitation Controversy
షార్ట్స్‌లో చూడండి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆటగాళ్ల సన్మాన కార్యక్రమంలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు అవమానం జరిగిందన్న ఆరోపణలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం స్పందించారు. జూన్ 4న విధాన సౌధ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి గవర్నర్‌ను ఎవరు ఆహ్వానించారో తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఆటగాళ్ల కోసం గవర్నర్‌ను వేదికపై నిరీక్షింపజేశారని, కాంగ్రెస్ నేతలు ఆటగాళ్లతో సెల్ఫీలు దిగుతూ ఆయన్ను పట్టించుకోలేదని వార్తలు వచ్చాయి.

ఈ ఆరోపణలపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన శివకుమార్, "గవర్నర్‌ను ఎవరు పిలిచారో ఆయన్నే అడగాలి. నాకేమీ తెలియదు. ఈ విషయంపై ఏకసభ్య విచారణ కమిషన్ దర్యాప్తు చేస్తోంది, నా వ్యాఖ్యలు విచారణను ప్రభావితం చేయకూడదు" అని అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిశారా అన్న ప్రశ్నకు, ఈసారి అధిష్ఠాన నేతలను కలవడం సాధ్యపడలేదని బదులిచ్చారు.

"జూన్ 18న కృష్ణా నదీ జలాల పంపిణీ అవార్డు విషయమై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశం ఉంది, అందుకోసం ఢిల్లీ వస్తాను. ప్రధానమంత్రిని కూడా కలవాలని ఆలోచిస్తున్నాం" అని తెలిపారు. "ఈరోజు యెట్టినహొళె తాగునీటి ప్రాజెక్టుపై సమావేశానికి హాజరయ్యేందుకు కర్ణాటకకు తిరిగి వెళ్లాలి" అని ఆయన వివరించారు.

సిద్ధరామయ్యపై కుమారస్వామి విమర్శలు

ఇదిలా ఉండగా, ఆర్సీబీ సన్మాన కార్యక్రమం జరిగిన విధాన సౌధ వద్ద ఏమీ జరగలేదని, చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలోనే 11 మంది మరణించారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన సీఎంపై విరుచుకుపడ్డారు. "గౌరవనీయులైన సిద్ధరామయ్య గారూ.. మీరు కర్ణాటక ముఖ్యమంత్రా లేక విధాన సౌధ మెట్ల ముఖ్యమంత్రా!? దయచేసి చెప్పండి?" అని ప్రశ్నించారు. "కేవలం పోలీసులపై నెపం నెట్టి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం? ప్రతిపక్షాలపై నిందలు వేసి తప్పించుకునే కుట్ర ఎందుకు?" అంటూ సీఎం సిద్ధరామయ్యను కుమారస్వామి విమర్శించారు.

డీకే సురేష్ కౌంటర్

కేంద్ర మంత్రి కుమారస్వామి విమర్శలపై డీకే శివకుమార్ సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేష్ ఘాటుగా స్పందించారు. "ఆర్సీబీ గెలిచిన తర్వాత, జట్టుకు ఊరేగింపు నిర్వహించాలని బీజేపీ, జేడీఎస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ ఈరోజు వారు మాట మార్చారు. బీజేపీ యూటర్న్ తీసుకోవడం కొత్తేమీ కాదు" అని అన్నారు.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్న బీజేపీ డిమాండ్‌పై స్పందిస్తూ, "రెండు పార్టీలూ ఊరేగింపు కావాలని డిమాండ్ చేశాయి. 'మీరు క్రీడాభిమానులను అవమానిస్తున్నారా, ఊరేగింపు నిర్వహించలేరా?' అని అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీకి ఇదే ధోరణి. ప్రజలు వారికి మెజారిటీ ఇవ్వలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన ఘోర విషాదాల జాబితాను మేం అందిస్తాం. బీజేపీ నేతలకు ఏమాత్రం నైతికత ఉన్నా, వారే ముందుగా రాజీనామా చేయాలి" అని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
DK Shivakumar
Karnataka
RCB
Royal Challengers Bangalore
Governor Thawar Chand Gehlot

More Telugu News