Mohan Babu: ఈ మాటలు నా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది పరమేశ్వరా!: మోహన్ బాబు స్పెషల్ వీడియో

ప్రముఖ నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం ‘కన్నప్ప’. ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మోహన్‌బాబు కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మోహన్‌బాబు తాజాగా ‘మై కన్నప్ప స్టోరీ’ పేరుతో ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో ఆయన తన తల్లి లక్ష్మమ్మ గురించి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లే తనకు నిజమైన కన్నప్ప అని ఆయన అభివర్ణించారు.

మోహన్‌బాబు మాట్లాడుతూ, "ఒక అమాయకుడు, ఆటవికుడు అయిన తిన్నడు.. పరమేశ్వరుడి కోసం తన కళ్లనే ఇచ్చి కన్నప్పగా చరిత్రలో నిలిచిపోయాడు. మన ఆకలిని గుర్తించి అమ్మ అడగకుండానే అన్నం పెడుతుంది. మనకు ఏది కావాలన్నా, వారి శక్తికి మించి అమ్మానాన్నలు మనకు అందిస్తారు. నా దృష్టిలో మా అమ్మానాన్నలే కన్నప్పలు. మా అమ్మ పేరు లక్ష్మమ్మ. దురదృష్టవశాత్తు ఆమెకు పుట్టుకతోనే రెండు చెవులూ వినిపించవు. ఆ మహాతల్లికి పరమేశ్వరుడు ఐదుగురు పిల్లల్ని ఇచ్చాడు" అని తెలిపారు.

తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, "టౌన్‌ నుంచి మా ఊరికి వెళ్లాలంటే సుమారు ఏడు కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. ఆ దారి కూడా సరిగా ఉండేది కాదు. ఒక కాలువ, సువర్ణముఖి నది దాటితే కానీ ఊర్లోకి వెళ్లలేం. అలాంటి దారిలో అమ్మ మమ్మల్నందరినీ మోసుకుంటూ ప్రయాణించేది. అది ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. ఈ విషయాలు గుర్తుకొస్తే చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. నా గొంతును అందరూ మెచ్చుకుంటున్నప్పుడు, ‘ఈ మాటలు నా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది పరమేశ్వరా’ అని బాధపడేవాడిని. నాకు నా కన్నతల్లే కన్నప్ప" అంటూ మోహన్‌బాబు ఉద్వేగభరితంగా తన మనసులోని మాటలను పంచుకున్నారు.

కాగా, భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ చిత్రం జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Mohan Babu
Kannappa Movie
Manchu Vishnu
Lakshmamma
My Kannappa Story
Telugu Cinema
Mukesh Kumar Singh
Movie Promotion
Telugu Movies
Indian Cinema

More Telugu News