పాక్ ఉగ్రసంస్థకు చైనా అండదండలు: బ్రెజిల్‌లో శశిథరూర్ ఆరోపణ

  • పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి టీఆర్‌ఎఫ్‌
  • టీఆర్‌ఎఫ్‌ను కాపాడుతోందంటూ చైనాపై శశిథరూర్ ఆగ్రహం
  • ఐరాసలో పాకిస్థాన్‌కు చైనా వత్తాసు
  • యూఎన్‌ఎస్‌సీ ప్రెస్ నోట్ నుంచి టీఆర్‌ఎఫ్ పేరు తొలగించారని ఆవేదన
  • ఈ తీరు మారాలంటే భద్రతా మండలిలో భారత్, బ్రెజిల్ ఉండాలన్న థరూర్
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి కారకులైన లష్కరే తోయిబాకు చెందిన ముసుగు సంస్థ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (టీఆర్‌ఎఫ్)ను చైనా రక్షిస్తోందని అఖిలపక్ష దౌత్య బృందం సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తీవ్రంగా విమర్శించారు. పాకిస్థాన్ ప్రభుత్వం, చైనా సహకారంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ)లోనూ, సంబంధిత పత్రికా ప్రకటనల్లోనూ టీఆర్‌ఎఫ్ పేరును ఉద్దేశపూర్వకంగా తొలగించిందని ఆయన ఆరోపించారు.

బ్రెజిల్ పర్యటనలో ఉన్న శశిథరూర్, ఆ దేశ అధ్యక్షుడి ప్రధాన సలహాదారు, దౌత్యవేత్త అయిన సెల్సో అమోరిమ్‌తో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

టీఆర్‌ఎఫ్‌కు సంబంధించిన అనేక ఆధారాలను ఐరాస ఆంక్షల కమిటీకి భారత్ పలుమార్లు సమర్పించిందని శశిథరూర్ గుర్తు చేశారు. అయినప్పటికీ, ప్రతిసారీ చైనా తన మిత్రదేశమైన పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తూ, టీఆర్‌ఎఫ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటోందని ఆయన వివరించారు.

లష్కరే తోయిబా ఏర్పాటు చేసిన ఈ టీఆర్‌ఎఫ్ సంస్థ, పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే బాధ్యత స్వీకరిస్తూ ప్రకటన చేసిందని, అయితే ఈ చర్య వల్ల ఎదురయ్యే అంతర్జాతీయ పరిణామాలను గుర్తించిన పాకిస్థాన్‌లోని సోషల్ మీడియా నిర్వాహకులు ఆ ప్రకటనను వెంటనే తొలగించారని శశిథరూర్ తెలిపారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విడుదల చేసే అధికారిక ప్రకటనల్లో టీఆర్‌ఎఫ్ ప్రస్తావనను చేర్చాలని భారత్ అనేకమార్లు డిమాండ్ చేసిందని ఆయన అన్నారు. అయినప్పటికీ, పాకిస్థాన్ ప్రభుత్వం చైనాలోని తమ మిత్రుల సహకారంతో ఆ పేరును పూర్తిగా తొలగించిందని, కనీసం దాని ప్రస్తావన కూడా లేకుండా చేసిందని శశిథరూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పక్షపాత వైఖరులు మారాలంటే భద్రతా మండలిలో భారత్, బ్రెజిల్ వంటి దేశాలకు స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.


More Telugu News