Kavitha: ఆంధ్రప్రదేశ్ అలా చేస్తుంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు: కవిత ప్రశ్న

- కేసీఆర్, ఆచార్య జయశంకర్ స్ఫూర్తితో జాగృతి ప్రస్థానమన్న కవిత
- సీఎం రేవంత్ రెడ్డి 'జై తెలంగాణ' నినాదం చేయాలని డిమాండ్
- నదీ జలాలపై జూన్ 2న ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్
- కేసీఆర్కు అండగా తెలంగాణ జాగృతి ఉంటుందని వెల్లడి
- కేసీఆర్కు నోటీసులు ఇవ్వడమంటే తెలంగాణను అవమానించడమేనని వ్యాఖ్య
బనకచర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని తరలించుకుపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. బంజారాహిల్స్లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ సంస్థ భవిష్యత్ కార్యచరణతో పాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ జాగృతి సంస్థ ఆవిర్భావం, ప్రస్థానం గురించి కవిత వివరిస్తూ, "కేసీఆర్ గారు, ఆచార్య జయశంకర్ సార్ల స్ఫూర్తితో తెలంగాణ జాగృతి ఏర్పడింది. ఈ సంస్థను ప్రారంభించి నేటికి 18 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇన్నాళ్లూ అశోక్నగర్లోని కార్యాలయం నుంచి కార్యకలాపాలు నిర్వహించాం. ఇప్పుడు బంజారాహిల్స్కు మార్చాం. ఇకపై ఇక్కడి నుంచే మా కార్యకలాపాలు కొనసాగుతాయి. ఈ ప్రయాణంలో ఎంతోమంది ఆశీస్సులు మాకు లభించాయి. మేం చేసిన అనేక ఉద్యమాల ఫలితంగా ఎన్నో జీవోలు కూడా వచ్చాయి" అని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, వారి గొంతుకగా తెలంగాణ జాగృతి సంస్థ పనిచేసిందని కవిత అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత విమర్శలు గుప్పించారు. "గత పదేళ్ల కేసీఆర్ పాలనకు, ఇప్పటి కాంగ్రెస్ పాలనకు చాలా తేడా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పటికైనా 'జై తెలంగాణ' అనాలి. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించాలి. కనీసం జూన్ 2న జరగబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైనా ఆయన 'జై తెలంగాణ' నినాదం చేయాలని డిమాండ్ చేస్తున్నాం" అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన 'రాజీవ్ యువ వికాసం' పథకం పేరుపైనా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. "జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం ఎందుకు తెస్తున్నారు? రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధం? తెలంగాణ యువ వికాసం అని పేరు పెట్టాలి" అని ఆమె వ్యాఖ్యానించారు.
బీజేపీ లక్ష్యంగా కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీసీ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోబోమని, పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆమె హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించేలోగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా తమ పోరాటం కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.
కేసీఆర్కు తాము అండగా ఉంటామని కవిత స్పష్టం చేశారు. "కేసీఆర్ గారికి తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ రెండు కళ్లలాంటివి. ఆయనపై ఈగ వాలినా మేం సహించం. కేసీఆర్కు నోటీసులు ఇచ్చారంటే అది యావత్ తెలంగాణ ప్రజానీకానికి నోటీసులు ఇచ్చినట్లే. తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ తెచ్చిన వ్యక్తికి నోటీసులు ఇస్తారా? అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్" అని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిషన్ కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ మహాధర్నాలో నోటీసుల వెనుక ఉన్న కుట్రను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.
నదీ జలాల పంపిణీ విషయంలో కవిత ఆందోళన
నదీ జలాల పంపిణీ విషయంలోనూ కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "గోదావరి-కావేరీ నదుల అనుసంధానంతో తెలంగాణకు రావాల్సిన నీళ్లు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉంది. బనకచర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని తరలించుకుపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏం చేస్తున్నారు? నదుల అనుసంధానాన్ని కేసీఆర్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. తుపాకుల గూడెం వద్ద రివర్ లింకేజీ ఉండాలని ఆయన సూచించారు. కానీ, కేంద్రం ఇచ్చంపల్లి వద్ద రివర్ లింకేజీ పెడతామని చెబుతోంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నదీ జలాలపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలి. వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయాలి" అని కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణ జాగృతి ఏర్పాటు వెనుక ఉన్న స్ఫూర్తిని కూడా కవిత గుర్తు చేసుకున్నారు. "కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితోనే తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశాం" అని ఆమె తెలిపారు. గతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ జాగృతి కార్యక్రమాలు చేపట్టినప్పుడు అనేక అవరోధాలు ఎదురయ్యాయని, "తెలంగాణ జాగృతి అంటేనే మిమ్మల్ని తొక్కేస్తారు అని చాలా మంది మేధావులు హెచ్చరించారు. ఆంధ్ర పాలకుల వివక్ష తీవ్రంగా ఉన్నప్పటికీ, వెనకడుగు వేయకుండా ముందుకు సాగాం" అని కవిత వివరించారు. "తెలంగాణ జాతిపిత కేసీఆర్కు నోటీసులు ఇస్తే, అది యావత్ తెలంగాణ ప్రజానీకానికి నోటీసులు ఇచ్చినట్లే" అని ఆమె వ్యాఖ్యానించారు.