స్లో ఓవ‌ర్ రేట్‌... ఆర్‌సీబీ, ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ల‌కు జ‌రిమానా

  • ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి రజత్, కమ్మిన్స్‌పై బీసీసీఐ చర్య
  • కమ్మిన్స్ జట్టు ఈ సీజన్‌లో చేసిన మొదటి నేరం కావడంతో రూ. 12 లక్షల జరిమానా
  • రెండోసారి నేరం చేసిన ఆర్‌సీబీ జట్టు సార‌థి ప‌టిదార్‌కు రూ. 24 లక్షల ఫైన్‌
ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ ప‌టిదార్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌లకు వారి జట్ల స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ జరిమానా విధించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం కమ్మిన్స్ జట్టు ఈ సీజన్‌లో చేసిన మొదటి నేరం కావడంతో రూ. 12 లక్షల జరిమానా విధించగా, రెండోసారి నేరం చేసిన ఆర్‌సీబీ జట్టు సార‌థి ప‌టిదార్‌కు రూ. 24 లక్షల జరిమానా వేసింది. 

"కనీస ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్‌లో అతని జట్టు చేసిన రెండవ నేరం ఇది. కాబట్టి ప‌టిదార్‌కు రూ. 24 లక్షల జరిమానా విధించింది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా ప్లేయింగ్ XIలోని మిగిలిన సభ్యులకు ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం, ఇందులో ఏది తక్కువైతే అది జరిమానా విధించ‌డం జ‌రిగింది " అని ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.

"కనీస ఓవర్ రేట్ నేరాలకు సంబంధించిన ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ఈ సీజన్‌లో స‌న్‌రైజ‌ర్స్‌ జట్టు చేసిన మొదటి నేరం. కాబట్టి కమిన్స్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించబడింది" అని ప్ర‌క‌టించింది. కాగా, నిన్న‌టి మ్యాచ్‌లో ఆర్‌సీబీకి జితేశ్ శ‌ర్మ నాయ‌క‌త్వం వ‌హించిన విష‌యం తెలిసిందే. అయితే, రెగ్యుల‌ర్ కెప్టెన్‌కే ఫైన్ వ‌ర్తించ‌నున్న‌ట్లు స‌మాచారం. దీంతో ర‌జ‌త్‌కు రూ. 24ల‌క్ష‌ల భారీ జ‌రిమానా ప‌డింది. 

ఇక, ప్లేఆఫ్స్ బెర్త్ ఇప్పటికే ఖాయమైన ఆర్‌సీబీ... నిన్న‌టి మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్‌ చేతిలో 42 పరుగుల తేడాతో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రాజ‌యంతో పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే అవకాశాన్ని రాయల్ ఛాలెంజర్స్ కోల్పోయింది. ప్ర‌స్తుతం ఆర్‌సీబీ 17 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ (18 పాయింట్లు), పంజాబ్ కింగ్స్ (17 పాయింట్లు) తర్వాత మూడవ స్థానానికి పడిపోయింది. నెట్‌ రన్ రేట్ (NRR) కూడా గణనీయంగా తగ్గింది.


More Telugu News