అలాంటి పవర్ ఫుల్ క్షిపణి చైనా, పాక్ వద్ద లేదు: జాన్ స్పెన్సర్

  • బ్రహ్మోస్ లాంటి పవర్ ఫుల్ క్షిపణి చైనా, పాకిస్థాన్ వద్ద లేవు:  అమెరికాకు చెందిన రిటైర్డ్ కల్నల్ జాన్ స్పెన్సర్
  • భారత్ ఆయుద్ధ సంపత్తిని కొనియాడిన జాన్ స్పెన్సర్ 
  • యుద్ద నైపుణ్యంలో భారత్ కు తిరుగులేదని నిరూపించుకుందని వ్యాఖ్య
బ్రహ్మోస్ లాంటి శక్తివంతమైన క్షిపణి చైనా, పాకిస్థాన్ వద్ద లేదని అమెరికాకు చెందిన యుద్ధ రంగ నిపుణుడు, రిటైర్డ్ కల్నల్ జాన్ స్పెన్సర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతంతో భారత్ ఎంత శక్తివంతమైనదో ప్రపంచ దేశాలకు నిరూపితమైందన్నారు. ఈ క్రమంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జాన్ స్పెన్సర్.. భారత్ ఆయుధ సంపత్తిని కొనియాడారు. చైనా, పాకిస్థాన్ రక్షణ వ్యవస్థలో భారత్‌లో ఉన్న బ్రహ్మోస్‌తో సరిపోల్చే క్షిపణులు కానీ, ఆయుధ సామాగ్రి కానీ లేవని స్పష్టం చేశారు.

పాకిస్థాన్‌తో జరిపిన యుద్ధంతో భారత్ యుద్ధ నైపుణ్యంలో తిరుగులేదని నిరూపించుకుందని ఆయన అన్నారు. అటు డిఫెన్స్, ఇటు ఎఫెన్స్ అయినా భారత్ శక్తి అమోఘమని ఆయన కొనియాడారు. భారత్‌కు చెందిన బ్రహ్మోస్ క్షిపణిపై ఆయన ప్రశంసలు కురిపించారు. భారత్ అమ్ములపొదిలో ఉన్న బ్రహ్మోస్ పనితీరును ఎంత పొగిడినా తక్కువేనని అన్నారు. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను, ఎయిర్ బేస్‌లను భారత్ సునాయాసంగా ఛేదించడంలో బ్రహ్మోస్ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. పాకిస్థాన్‌లోని ఏ ప్రదేశాన్ని అయినా సునాయాసంగా ఛేదించగలదనే సందేశాన్ని భారత్ చాలా స్పష్టంగా పంపిందన్నారు.

అత్యంత శక్తివంతమైన ఆర్మీ కలిగిన దేశాల జాబితాలో భారత్‌ది నాల్గవ స్థానంగా ఉంది. టాప్ 5లో అమెరికా, రష్యా, చైనా, భారత్, దక్షిణ కొరియాలు ఉన్నాయి. చైనా కంటే భారత్ ఒక స్థానం కిందే ఉన్నప్పటికీ, ఆపరేషన్ సిందూర్ విజయవంతంతో భారత్ బలం మరింత పెరిగిందని ఈ రక్షణ రంగ నిపుణుడు విశ్లేషించారు. 


More Telugu News