అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
- అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలకు భారత్ నిర్ణయం
- భారత ఉక్కు, అల్యూమినియంపై సుంకాలకు ప్రతిచర్య
- డబ్ల్యూటీఓకు అధికారికంగా తెలిపిన భారత్
- కొన్ని అమెరికా వస్తువులకు రాయితీల రద్దు, సుంకాల పెంపు
కొన్ని ఎంపిక చేసిన అమెరికా ఉత్పత్తులకు ఇప్పటివరకు కల్పిస్తున్న రాయితీలను ఉపసంహరించుకోవడంతో పాటు, వాటిపై దిగుమతి సుంకాలను గణనీయంగా పెంచనున్నట్లు భారత్ డబ్ల్యూటీఓకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
అమెరికా తీసుకున్న ఏకపక్ష వాణిజ్య నిర్ణయాల వల్ల సుమారు 7.6 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అగ్రరాజ్యం అనుసరిస్తున్న ఈ రక్షణాత్మక ధోరణులను భారత్ గతంలోనే తప్పుబట్టిన విషయం తెలిసిందే.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాక పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే ముడి ఉక్కు ఉత్పత్తిలో రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్పై కూడా ఈ సుంకాల ప్రభావం గణనీయంగా పడింది. ఈ నేపథ్యంలో, భారత్ తమ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకునేందుకు డబ్ల్యూటీఓ వేదికగా ఈ అంశాన్ని బలంగా ప్రస్తావిస్తోంది.
భారత్, అమెరికాల మధ్య నూతన వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు చర్చలు తుది దశకు చేరుకున్నాయని వార్తలు వస్తున్న తరుణంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికాతో వాణిజ్య లోటును తగ్గించేందుకు భారత్ ఈ ఒప్పందంలో భాగంగా పలు కీలక రాయితీలు కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసిందని గతంలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ప్రస్తుత ప్రతీకార చర్యల నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.